- పార్టీని వీడుతూ బురదజల్లే ప్రయత్నం సరికాదు: టీడీపీ నేతలు
హైదరాబాద్, వెలుగు : కాసాని జ్ఞానేశ్వర్ వెళ్లిపోయినంత మాత్రాన టీడీపీకి ఎలాంటి నష్టం ఉండదని ఆ పార్టీ నేతలు అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన వ్యక్తి.. పార్టీని వీడి వెళుతూ బురద జల్లే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదని వారు విమర్శించారు. మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్పై విడుదలైన సందర్భంగా టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, అర్వింద్ కుమార్ గౌడ్, అధికార ప్రతినిధి తిరునగరి జోత్య్న మాట్లాడారు. కొంత మంది వ్యక్తుల కోసం పార్టీ నిర్ణయాలు ఉండవని, రాష్ట్రంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై అనుభవం ఉన్న వ్యక్తి సూచించిన నిర్ణయాన్ని అందరూ పాటించాలన్నారు. ఒకరిద్దరు వెళ్లిపోతే పార్టీకి ఎలాంటి నష్టం వాటిళ్లదన్నారు. టీడీపీ సముద్రం లాంటిదని, చాలా మంది నాయకులను చూసిన పార్టీ అని, ఎవరు వెళ్లిపోయినా బలహీనపడదు అని వారు పేర్కొన్నారు.