- ఓ వైపు రిపేర్లు.. మరోపైపు లీకేజీలు
- బోరింగులు, బావులను ఆశ్రయిస్తున్న జనం
- చాలా మండలాల్లో ఇప్పటికే తాగునీరు అందట్లే
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో సమ్మర్ వస్తున్నా తాగునీటికి సప్లైకి ముందస్తు ప్రిపరేషన్స్ ప్రారంభించలేదు. ప్రస్తుతమున్న మిషన్ భగీరథ పైప్లైన్లలో రిపేర్లు, లీకేజీలు ఉండగా.. సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించకపోవడంతో ఈసారీ తాగునీటికి కష్టాలు తప్పేలా లేవు.
జిల్లాలో 266 గ్రామాలతో పాటు మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉండగా.. వీటి పరిధిల్లో 681 వాటర్ట్యాంకులు, దాదాపు 4,500 బోర్ వెల్స్ ఉన్నాయి. వీటితోపాటు తాగునీటి బావులు 300 పై చిలుకు ఉన్నాయి. అత్యవసరమనుకుంటే తాగునీటిని అందించడానికి వ్యవసాయ బావులను కూడా ఉపయోగిస్తారు.
భగీరథ ఉన్నా తాగునీటికి కరువే
మిషన్ భగీరథ కింద జిల్లాలో వేల కిలోమీటర్ల పరిధిలో పైప్ లైన్లు వేశారు. పట్టణాలు, గ్రామాల్లోని చాలా కుటుంబాలకు భగీరథ పైప్ లైన్ల ద్వారా నీరు అందటం లేదు. భగీరథ పైపులు ఎక్కడికక్కడ లీకేజీలు అవుతుండటంతో వాటిని రిపేర్లు చేయడానికే టైం సరిపోతుంది. దీంతో జనాలు యథావిధిగా బోరింగులు, బావుల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో పైపులు లీకేజీ అవుతున్నాయి. గ్రామాల్లో భగీరథ పైపులైన్లు లీక్ అవుతుండడంతో రిపేర్లు చేయించడంలో జీపీలు జాప్యం చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
ఈక్రమంలో గ్రామాల్లోనూ వారానికి మూడు రోజులే నీరు అందిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మానేరు పరివాహ మండలాలు ఇప్పటికీ మానేరులో సంపులు ఏర్పాటు చేసుకొని ఆ నీటిని ట్యాంకులకు ఎక్కించి ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం మానేరు కూడా ఎండిపోతుండటంతో సమ్మర్లో తాగునీటి పరిస్థితి ఏంటని ప్రజలు భయందోళన చెందుతున్నారు.
మున్సిపాలిటీల్లో అంతే...
పంచాయతీలతో పాటు మున్సిపాలిటీల్లో కూడా నీటి సరఫరా కష్టంగా మారుతోంది. ఇప్పటికే టౌన్లలో రెండు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడం, ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోకపోవడంతో పట్టణాల్లో జనవరి నుంచే తాగునీటికి జనం ఇబ్బంది పడుతున్నారు. పట్టణాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులు పాతవి కావడంతో తరచూ రిపేర్ అవుతున్నాయి. వాటిని బాగు చేయడానికి నెలలు పడుతుంది. అలాగే భగీరథ ఇంట్రో తరచూ లీకేజీ కావడంతో వాటర్ సప్లయ్ నిలిచిపోతోంది. భగీరథ నీటి సరఫరాపై అధికారులు దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
