- కోర్టే కేసు నమోదు చేయనట్టు ప్రచారం చేయడం సరికాదు
- ఈ విషయంలో మీడియా బాధ్యతారహితంగా ప్రవర్తించిందని అసహనం
న్యూఢిల్లీ: విద్యార్థుల పార్లమెంట్ ముట్టడి సందర్భంగా పోలీసులు అతిగా ప్రవర్తించినట్లుగానీ, లాఠీ చార్జ్ చేసినట్లుగానీ సుప్రీంకోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు కాలేదని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కేసు నమోదు చేయడానికి నిరాకరించిందంటూ వస్తున్న వార్తలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. కొన్ని మీడియా సంస్థలు బాధ్యతారహితంగా కథనాలు ప్రచురించాయని ఆయన విమర్శించారు.
శుక్రవారం అత్యవసర పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్తో కూడిన బెంచ్ ముందు చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. “పార్లమెంట్ ముట్టడి రోజు నుంచి ఇప్పటివరకు పరిశీలించాను. సుప్రీంకోర్టులో ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదు. ఒక లాయర్ నుంచి కేవలం రిప్రజెంటేషన్ మాత్రమే వచ్చింది. దానిని రిట్ పిటిషన్గా ఎలా పరిగణిస్తాం? ఈ మాత్రానికి.. కోర్టే కేసు నమోదు చేయలేదని బాధ్యతారహితంగా ప్రచారం చేస్తున్నారు” అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.
విచారణ వీడియోలు.. సోషల్ మీడియాలో వద్దు
కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్లను ముందస్తు అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై సుప్రీంకోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. వాటిని ఇతర డిజిటల్ వేదికల్లో పోస్టు చేయడం, షేర్ చేయడం, వాటితో ఆదాయం పొందడాన్ని బ్యాన్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
విచారణల లైవ్ స్ట్రీమింగ్, వీడియోల షేరింగ్ను కంట్రోల్ చేయాలని కోరుతూ దాఖలైన పిల్పై విచారణలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లేదా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నాకే కోర్టు విచారణల ఆడియో, వీడియోలను వాడుకోవాలని పేర్కొంది.
