మాజీ పోలీస్ అధికారి శివానందరెడ్డికి నోటీసులు

మాజీ పోలీస్ అధికారి శివానందరెడ్డికి నోటీసులు
  •     బుద్వేల్‌లో అసైన్డ్‌ భూముల అక్రమ కొనుగోళ్ల కేసులో జారీ చేసిన సీసీఎస్​ పోలీసులు

హైదరాబాద్‌, వెలుగు :  రాజేంద్రనగర్‌‌ బుద్వేల్‌లోని 26 ఎకరాల అసైన్డ్‌ భూముల అక్రమ కొనుగోళ్ల కేసులో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మాజీ పోలీస్ అధికారి శివానందరెడ్డి, ఆరోగ్యం రెడ్డికి గురువారం నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్​ బషీర్‌‌బాగ్‌లోని సీసీఎస్ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం ఆలూరు గ్రామంలోని శివానందరెడ్డి ఇంటికి సీసీఎస్‌ పోలీసులు గతవారం వెళ్లారు.

పోలీసుల విచారణకు శివానందరెడ్డి సహకరించలేదు. అక్కడికెళ్లిన పోలీసులను అడ్డుకున్నారు. దీంతోపాటు నిందితులైన మాంద్ర కనిష్క, మంద ఉమాదేవి, పైరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి శివానంద్​రెడ్డి స్టే కోసం హైకోర్టును ఆశ్రయించారు. 41ఏ కింద నోటీసులివ్వాలని కోర్టు ఆదేశాలివ్వడంతో నిందితులైన మాంద్ర కనిష్క, మంద ఉమాదేవి, పైరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు.

దీంతో ఈ ముగ్గురు నిందితులు శుక్రవారం సీసీఎస్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అసైన్డ్‌ భూమి కొనుగోలుతో పాటు కంపెనీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను శివానందరెడ్డి చూసుకుంటున్నారని విచారణలో వెల్లడించారు. శివానందరెడ్డి ఆదేశాల మేరకు డబ్బు, చెక్కులు అందించినట్టు వెల్లడించారు. కన్వేయన్స్ డీడ్ అమలు చేసిన రోజునే భూములు మొత్తం తమ పేర్లపై రిజిస్ట్రేషన్​ చేసుకున్నామన్నారు. పేదలకు చెందిన అసైన్డ్ భూములు కొనుగోలు చేయకూడదని తెలిసి కూడా బెదిరించి తమ పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని పోలీసులు గుర్తించారు.

అసైన్డ్​ భూములను ఆక్రమించారు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో బుద్వేల్‌ గ్రామపరిధిలోని 282,299 సర్వే నంబర్స్​లో 281 ఎకరాల విస్తీర్ణంలో సాగు మిగులు భూములను అసైన్డ్‌ ల్యాండ్స్‌గా మార్చినట్టు వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూములను ల్యాండ్ అసైన్‌మెంట్ రూల్స్​కు విరుద్ధంగా ఎస్‌కే డెవలపర్‌కు లీజుకు ఇచ్చారని చేవెళ్ల ఆర్డీఓ పట్టాలు అన్ని రద్దు చేశారు. ఆ భూములను హెచ్‌ఎండీఏ, టూరిజం శాఖకు అప్పగించారు. దీంతో  2000 నుంచి హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి.

కాగా, తనకున్న పలుకుబడితో వీటిని సెటిల్‌మెంట్‌ చేస్తానని మాజీ పోలీస్ అధికారి శివానందరెడ్డి.. ఎస్​కే డెవలపర్స్​ యజమానులు టీజే ప్రకాశ్​, దయానంద్‌తో   సంప్రదింపులు జరిపాడు. మధ్యవర్తిగా అసైన్డ్‌ భూములపై అగ్రిమెంట్లు/ఎంఓయూలు చేసుకునేందుకు ప్లాన్ చేశారు. వివాదస్పదంగా ఉన్న 26 ఎకరాలకు సంబంధించి శివానందరెడ్డి తన కంపెనీ పేరు మీద భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తర్వాత వాటిని మాంద్ర కనిష్క, మంద ఉమాదేవి, పైరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్లపై రిజిస్ట్రేషన్​ చేయించి ఇచ్చారు.