హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ప్రాజెక్టును తాత్కాలికంగా కేఆర్ఎంబీ తమ ఆధీనంలోకి తీసుకుంది. సోమవారం కేఆర్ఎంబీ మెంబర్ అజయ్కుమార్, ఈఈలు రఘునాథ్, శివశంకరయ్య ప్రాజెక్టును సందర్శించారు. సాగర్ ఐదు, ఏడో నంబర్ గేట్లు ఎత్తి ఏపీకి నీటిని విడుదల చేశారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆపరేషన్స్ తాత్కాలికంగా తెలంగాణ ఆధీనంలో ఉన్నాయి. ఏపీకి కేటాయించిన నీటిలో ఐదు టీఎంసీలు నాగార్జున సాగర్ నుంచి ఇచ్చేందుకు ఇటీవల అనుమతి ఇచ్చారు. తమకు ఆ నీటిని విడుదల చేయాలని ఏపీ కోరడంతో సోమవారం ఉదయం నీటి విడుదలపై హైడ్రామా చోటు చేసుకుంది. ఈఎన్సీ (జనరల్) మురళీధర్, నాగార్జున సాగర్సీఈ అజయ్కుమార్ కేఆర్ఎంబీ చైర్మన్ శివ్నందన్కుమార్తో సమావేశమయ్యారు. చట్ట ప్రకారం ప్రాజెక్టు ఆపరేషన్తామే చేయాల్సి ఉంటుందని, లేనిపక్షంలో బోర్డు అధికారులు మాత్రమే నీటిని విడుదల చేయాలని కోరారు.
అలాకాకుండా ఏపీ అధికారులు నీటిని విడుదల చేస్తే అంగీకరించబోమన్నారు. కేఆర్ఎంబీ చైర్మన్ వెంటనే బోర్డు మెంబర్సహా ఇద్దరు ఈఈలను ప్రాజెక్టు వద్దకు పంపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు (గతేడాది నవంబర్29న అర్ధరాత్రి) ఏపీ పోలీసులతో సహా ఆ రాష్ట్ర ఇంజనీర్లు ప్రాజెక్టు పైకి అక్రమంగా చొచ్చుకువచ్చి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇలా తరలించిన 1.07 టీఎంసీలను మినహాయించి 3.03 టీఎంసీలను బోర్డు పర్యవేక్షణలో తరలించనున్నారు. ఆ తర్వాత బోర్డు అధికారులే ప్రాజెక్టు గేట్లు మూసేయనున్నారు. సాగర్కుడి కాలువ గేట్లను ఏపీ స్వాధీనం చేసుకొని అక్రమంగా నీటిని విడుదల చేయడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల సీఎస్లు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తదుపరి ఆదేశాలు ఇచ్చి ప్రాజెక్టు వద్ద యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వహణను తాత్కాలికంగా కేఆర్ఎంబీకి అప్పగించాలని తేల్చిచెప్పారు.
వెంటనే సీఆర్పీఎఫ్బలగాలను ప్రాజెక్టుపై మోహరించారు. ప్రాజెక్టు నిర్వహణ అంశంపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన సమావేశం నిర్వహించాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ అధికారులు కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేయడానికి వారం రోజులుగా ప్రయత్నిస్తుండగా సీఆర్పీఎఫ్బలగాలు అడ్డుకుంటున్నాయి. సోమవారం బోర్డు జోక్యంతో ఏపీకి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణపై చర్చించేందుకు మంగళవారం రెండు రాష్ట్రాల అధికారులతో కేఆర్ఎంబీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.