- పెద్ద కంపెనీలూ ఇన్వెస్టర్లను ముంచినయ్!
- ఇన్వెస్టర్లకు రూ.14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 11 కంపెనీలు
- పతనమైన అదానీ, ఐటీ షేర్లు
- రిలయన్స్ ఇన్వెస్టర్లకూ రూ.1.4 లక్షల కోట్ల లాస్
న్యూఢిల్లీ: పెద్ద షేర్లలో ఇన్వెస్ట్ చేయడం వలన నష్టం రాదని చాలా మంది ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. కానీ, గత ఏడాది కాలంలో 11 పెద్ద షేర్ల వలన ఇన్వెస్టర్లు రూ. 14 లక్షల కోట్లు నష్టపోయారు. వీటిలో ఐదు నిఫ్టీ 50 లో ఉన్నాయి. ఇండెక్స్ మేజర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇన్వెస్టర్లకు భారీ నష్టాలే మిగిల్చింది. ఈటీ మార్కెట్స్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, రిలయన్స్ షేరు గత ఏడాది కాలంలో 14 శాతం పడింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 1.4 లక్షల కోట్లు తగ్గింది. పైన పేర్కొన్న 11 షేర్లలో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టన్సీ సర్వీసెస్, విప్రో వంటి టాప్ ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి. యూఎస్, యూరప్లో ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా మారడంతో ఈ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. గత ఏడాది కాలంలో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.1.6 లక్షల కోట్లు తగ్గగా, టీసీఎస్ మార్కెట్ రూ.1.4 లక్షల కోట్లు, విప్రో మార్కెట్ క్యాప్ రూ.94 వేల కోట్లు తగ్గింది. ఈ ఐటీ కంపెనీల షేర్లు గత ఏడాది కాలంలో 12–31 శాతం వరకు పడ్డాయి.
హిండెన్బర్గ్తో అదానీ ఇన్వెస్టర్లకు..
అదానీ గ్రూప్ షేర్లు ఈ ఏడాది ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో ఈ గ్రూప్ షేర్లు 60 శాతం వరకు క్రాష్ అయ్యాయి. మార్కెట్ క్యాప్ పరంగా, గత ఏడాది కాలంలో అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.3 లక్షల కోట్లు, అదానీ టోటల్ గ్యాస్ రూ.1.7 లక్షల కోట్లు, అదానీ ట్రాన్స్మిషన్ రూ.1.8 లక్షల కోట్లు నష్టపోయాయి. ఇన్వెస్టర్లు భారీగా నష్టలు మిగిల్చిన షేర్లలో బజాజ్ ఫైనాన్స్, వేదాంత కూడా ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ గత ఏడాది కాలంలో రూ. 81 వేల కోట్లు తగ్గింది. ఈ కంపెనీ షేరు 19 శాతం నష్టపోయింది. వేదాంత ఇదే టైమ్లో రూ.53,700 కోట్ల మార్కెట్ క్యాప్ కోల్పోగా, షేరు వాల్యూ 34 శాతం పడింది. నైకా బ్రాండ్ను ఆపరేట్ చేస్తున్న ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ మార్కెట్ క్యాప్ గత ఏడాది కాలంలో రూ.51 వేల కోట్లు తగ్గగా, ఈ కంపెనీ షేరు 59 శాతం క్రాష్ అయ్యింది.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
పెద్ద షేర్లు కాబట్టి తిరిగి లేస్తాయనడంలో సందేహం లేదు. మార్కెట్ నిలకడగా ఉండడంతో ఈ షేర్లు బౌన్స్ బ్యాక్ అవుతాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. కానీ, కొన్ని సెక్టార్ల షేర్లలో మాత్రం అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చని చెప్పారు. ఐటీ కంపెనీల మార్చి క్వార్టర్ రిజల్ట్స్ డల్గా ఉన్నాయి. ఫలితంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 7 శాతం మేర నష్టపోయింది. ‘ఐటీ ఇండెక్స్ కీలక సపోర్ట్ అయిన 26,300 – 26,200 కు పడింది. ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయితే 27,250–27,730 వరకు వెళ్లొచ్చు. ఒక వేళ ఈ సపోర్ట్ లెవెల్ కోల్పోతే 25,600 – 25,000 వరకు పడుతుంది’ అని షేర్ఖాన్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ జతిన్ గేడియా అన్నారు. వేదాంత షేరుపై కూడా ఆయన బేరిష్గా ఉన్నారు. మెటల్ సెక్టార్లో వీక్గా ఉన్న షేర్లలో ఇదొకటి. వేదాంత షేరు గత కొన్ని వారాలుగా రూ.260–295 వద్ద కన్సాలిడేట్ అవుతోంది.