జ్యోతినగర్, వెలుగు : ఎన్టీపీసీ సంస్థల సదరన్ రీజియన్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం ప్రారంభమైంది. మహాత్మాగాంధీ స్టేడియంలో నిర్వహించిన క్రికెట్, బ్యాడ్మింటన్ పోటీలను సంస్థ ఈడీ కేదార్ రంజన్ పాండు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరకదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చెప్పారు. చిన్నప్పటి నుంచే ఆటల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఆటల్లో గెలుపోటములు సహజమేనని, వాటిని పట్టించుకోకుండా క్రీడాస్ఫూర్తితో ముందుకుసాగాలని చెప్పారు.
కాగా పోటీలకు సదరన్ రీజియన్ పరిధిలోని వివిధ రాష్ట్రాల్లోని ఎన్టీపీసీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు హాజరయ్యారు. కుడిగి, కాయంకులం, సింహాద్రి, ఎస్ఆర్హెచ్క్యూ, రామగుండం ఏరియాల నుంచి 100 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో దీప్తీ మహిళా సమితి అధ్యక్షురాలు చిన్మోయ్ దాస్, స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సంతోష్ తివారీ, సెంట్రల్ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా పాల్గొన్నారు.
