70 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం : ఎన్​వీకే శ్రీనివాస్​

70 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం : ఎన్​వీకే శ్రీనివాస్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈ ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని సింగరేణి డైరెక్టర్​ఎన్​వీకే శ్రీనివాస్​ తెలిపారు. కొత్తగూడెంలోని ఇల్లెందు క్లబ్​లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంగళవారం నాటికి  65.41మిలియన్​ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశామని తెలిపారు.

కోల్​ ట్రాన్స్​పోర్టు టార్గెట్​ ప్రకారంగా కొనసాగుతోందన్నారు. టీఎస్​ జెన్కో, టీఎస్​ ట్రాన్స్​కోల ద్వారా సింగరేణికి దాదాపు రూ. 29వేల కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. సింగరేణిలోని పెద్దపల్లి, ఆర్జీ–1,2, భూపాలపల్లి ప్రాంతాల్లో స్కిల్​ డెవలప్​మెంట్​ ట్రైనింగ్​ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎడ్​సీల్​ సంస్థ ద్వారా సింగరేణిలో ప్రధానమైన నియామకాలకు సంబంధించి ఎగ్జామ్స్​ను నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.

1,359ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైందన్నారు. గవర్నమెంట్​ ఆదేశిస్తే బొగ్గు బ్లాక్​ల వేలంలోనూ పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 1400 మిలియన్​ టన్నుల బొగ్గు నిల్వలు 20 ఏండ్ల వరకు వస్తాయన్నారు. తాడిచర్ల కోల్​ ప్రాజెక్ట్​ సింగరేణికి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సమావేశంలో జీఎంలు కె. బసవయ్య, హనుమంతరావు, అధికారులు శ్రీనివాస్​, వరప్రసాద్​ పాల్గొన్నారు.