భవిష్యత్తులో ఔటర్ రింగు రోడ్డు చుట్టూ మెట్రో.. : మెట్రో ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి

భవిష్యత్తులో ఔటర్ రింగు రోడ్డు చుట్టూ మెట్రో.. : మెట్రో ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి

హైదరాబాద్ మెట్రోను ఫ్యూచర్లో ఔటర్‌ రింగ్‌ రోడ్‌ చుట్టూ విస్తరించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో విస్తరణకు సంబంధించి రూ.69 కోట్లతో జులై 31న రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం తెలిసిందే. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడమే ధ్యేయంగా మెట్రో విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.  

ఈ సందర్భంగా ఆగస్టు 1న బేగంపేట్ మెట్రో రైల్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడ్చల్‌ నుంచి పటాన్‌చెరుకు29 కిలోమీటర్లు, తార్నాక నుంచి ఈసీఐఎల్‌ వరకు 8  కిలోమీటర్లు, ఎల్‌బీనగర్‌ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు మెట్రో కారిడార్‌ విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పటాన్‌ చెరు నుంచి నార్సింగి వరకు 22 కి.మీ. మేర మెట్రో కారిడార్‌, తుక్కుగూడ, బొంగుళూరు, పెద్ద అంబర్‌పేట వరకు 40 కిలోమీటర్లు మెట్రో కారిడార్‌ నిర్మించనున్నామన్నారు.  

జేబీఎస్‌ నుంచి తూంకుంట వరకు డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మించనున్నామన్న ఆయన.. ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు మెట్రో  రైలును విస్తరిస్తామన్నారు. కోటి జనాభాకు సరిపడేలా మెట్రోను విస్తరించాలనే ఆలోచన ఉందన్నారు.

గతంలో తన ప్రతిపాదనను అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.  నాగోల్‌ టు ఎల్‌బీనగర్‌ కు మెట్రోను అనుసంధానిస్తామన్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా మెట్రో పనులు త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు 28 కిలోమీటర్ల మేర మెట్రో రైలు విస్తరించనున్నట్లు చెప్పారు. ఉప్పల్ నుంచి బీబీనగర్‌ వరకు 25 కిలోమీటర్లు, తార్నాక నుంచి మౌలాలి వరకు ఐదుస్టేషన్లతో ఈ ట్రైన్ ని  నిర్మిస్తామని చెప్పారు. 

కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో కలిస్తే.. 

కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో కలిస్తే మెట్రో రైలు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు అక్కర్లేదని ఎండీ తెలిపారు. ప్రస్తుతం సరాసరి మెట్రోలో 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని మరో ఏడాది నాటికి ఆ సంఖ్య 7 లక్షలకు చేరుకుంటుందని అన్నారు.  ఓ ఆర్ ఆర్ మెట్రో ను నాలుగు కారిడార్ లుగా విభజించామన్నారు.  హైదరాబాద్ మహానగర భవిష్యత్తు అవసరాలకనుగుణంగానే వీటిని విస్తరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.