ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేంద్రం నుంచి..ఉప్పల్ కు నిధులు తీసుకొస్త : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేంద్రం నుంచి..ఉప్పల్ కు నిధులు తీసుకొస్త : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఉప్పల్, వెలుగు : తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉప్పల్ సెగ్మెంట్​కు కేంద్రం నుంచి  నిధులు తీసుకొస్తానని బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. ఉప్పల్​లో ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మేకల భారతి గార్డెన్ నుంచి సూర్యనగర్ కాలనీ, సరస్వతినగర్ కాలనీ, హనుమాన్ సాయినగర్, విజయపురి కాలనీ, సత్యనగర్, శాంతినగర్ మీదుగా వెంకటేశ్వర స్వామి కమాన్ వరకు బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్​తో కలిసి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు  కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఉప్పల్ కారిడార్​ సాధించానన్నారు. తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఉప్పల్ సెగ్మెంట్​లో కొత్త డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తానన్నారు. బీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల వారిని మోసం చేసిందన్నారు. ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఒక్కసారి ఎమ్మెల్యేగా ప్రభాకర్​ను గెలిపిస్తే ఎంతో అభివృద్ది చేశాడని.. ఉప్పల్ సెగ్మెంట్​కు తాగునీటి సమస్యను తీర్చాడన్నారు.

ALSO READ: ఫేక్ డాక్టర్లు సర్జరీలు చేసి.. ఏడుగురిని చంపేశారు

అవినీతి మరక లేని ప్రభాకర్​ను మళ్లీ గెలిపించాలని లక్ష్మణ్ కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు, హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన నరేశ్, సెగ్మెంట్ కన్వీనర్ దేవసాని బాలచందర్, సీనియర్ నేతలు మహంకాళి లక్ష్మణ్​, రావుల బాలకృష్ణ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సతీశ్, ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు  దేవేందర్ రెడ్డి, రామంతాపూర్ డివిజన్ అధ్యక్షుడు బండారు వెంకటరావు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.