ODI World Cup 2023: అద్భుతాలు జరుగుతాయి.. మేం సెమీస్ చేరుతాం: పాక్ వైస్ కెప్టెన్

ODI World Cup 2023: అద్భుతాలు జరుగుతాయి.. మేం సెమీస్ చేరుతాం: పాక్ వైస్ కెప్టెన్

ఆడిన ఐదింటిలో రెండు విజయాలు, మూడు ఓటములు.. 4 పాయింట్లతో ఆరోస్థానం.. ఈసారి వరల్డ్ కప్ గెలిచేది తామే అంటూ భారత గడ్డపై అడుగుపెట్టిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రయాణం ఇది. నేడు(అక్టోబర్ 27) స్పిన్‌కు అనుకూలించే చెపాక్‌ పిచ్‌పై దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్ రేసు. అదే ఓడితే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టు బాటలో పరువు అనే నినాదాన్ని ఎత్తుకోవాల్సిందే. పోనీ, ఈ స్థాయిలో ఓడిపోతున్నారు కదా! ఆ జట్టు ఆటగాళ్లు అనుకువగా ఉంటున్నారా! అంటే అదీ లేదు. ఇప్పటికీ ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నారు. 

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న పాకిస్తాన్ జట్టు వైస్ షాదాబ్ ఖాన్.. పాకిస్తాన్ జట్టు సెమీస్ చేరుతుందని జోస్యం చెప్పాడు. ఇప్పటివరకూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో మూడు విభాగాల్లోనూ విఫలమయ్యామని అంగీకరించిన షాదాబ్ ఖాన్, తరువాతి మ్యాచ్‌ల్లో బాగా రాణిస్తామనే ధీమా వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో తాము అద్భుతాలను బాగా నమ్ముతామని, వరల్డ్ కప్ సెమీస్ చేరతామని అనుకుంటున్నామని తెలిపాడు.

పాకిస్తాన్ తదుపరి మ్యాచ్‌లు

  • అక్టోబర్ 31న బంగ్లాదేశ్‌తో(కోల్‌కతా),
  • నవంబర్ 4న న్యూజిల్యాండ్‌తో(బెంగళూరు),
  • నవంబర్ 11న ఇంగ్లాండ్‌తో(కోల్‌కతా)