కోరమండల్ రైలు ప్రమాద బాధితులకు ఒడిశా ప్రభుత్వం 2023 జూన్ 04 ఆదివారం రోజున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒడిశాకు చెందిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.లక్ష చొప్పున సాయం అందజేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఒడిశా సీఎంవో కార్యాలయం ట్వీట్ చేసింది. మృతుల కుటుంబాలకు సీఎం నవీన్ పట్నాయక్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రమాదం జరిగిన రోజున కేంద్రప్రభుత్వం మృతుల కుటుంబాలకుల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు అందజేస్తామని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది, మరోవైపు కేంద్ర రైల్వే శాఖ కూడా మృతుల కుటుంబాలకుల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
మృతుల కుటుంబానికి రూ. 10 లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ. 2 లక్షల, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం అందజేయనున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఘోర ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా వెయ్యికి పైగా గాయపడినట్లుగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.