పాశమైలారం గ్రామంలో .. 500 టన్నుల పీడీఎస్​ బియ్యం పట్టివేత

పాశమైలారం గ్రామంలో .. 500 టన్నుల పీడీఎస్​ బియ్యం పట్టివేత
  • 3లారీలు, 4డీసీఎంలు సీజ్

పటాన్​చెరు, వెలుగు: టాస్క్​ఫోర్స్​, సివిల్​ సప్లై సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో  అక్రమంగా తరలించేందుకు సిద్దంగా ఉన్న 500 క్వింటాళ్ల పీడీఎస్​బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  3 లారీలు, 4 డీసీఎంలను సీజ్​ చేశారు. ఈ మేరకు  ఎస్పీ రూపేశ్​ సోమవారం వివరాలు వెల్లడించారు. భానూర్ పీఎస్​ పరిధిలో ని పాశమైలారం గ్రామంలో అక్రమంగా నడుపుతున్న ఒక రైస్ మిల్లును తనిఖీ చేయగా పీడీఎస్​ బియ్యాన్ని  గుర్తించినట్లు తెలిపారు. 

నిజామాబాద్​ జిల్లా బోధన్​ టౌన్​కు చెందిన ప్రభాకర్​ రెడ్డి కొంత కాలంగా రైస్​ మిల్లును నడుపుతూ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన వడ్లను తన రైస్ మిల్లులో పట్టించి పీడీఎస్​రైస్ గా మార్చి ఎఫ్​సీఐ గోదాంకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ప్రభాకర్ రెడ్డి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వం పంపిణీ చేసిన పీడీఎస్​ రైస్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని గోదాంకు పంపించే  రైస్ తో కలిపి పంపిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నట్లు చెప్పారు. 

తన వ్యాపారానికి వీలుగా సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో రైస్​ మిల్లును ఏర్పాటు చేసుకుని తన దందాను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు ప్రభాకర్ రెడ్డి పరారీలో ఉండగా, రైస్ మిల్లు నడుపుతున్న రవిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.