
రాజన్న సిరిసిల్ల జిల్లా: అధికారులు సమన్వయంతో పని చేసి వేములవాడ మహా శివరాత్రి జాతరను విజయవంతం చేయాలని అన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలోని ఓపెన్ స్లాబ్ లో మహా శివ రాత్రి జాతర పై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహాశివుని దర్శనానికి తప్పకుండా 4 నుండి 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని , శివరాత్రికి ఇంకా 40 రోజుల సమయం ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, ఫైర్, వైద్యం, రెవిన్యూ అన్ని శాఖల వారు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ప్రస్తుతం ప్రజల్లో కోవిడ్ వలన భయం తగ్గిందని..అయినా మాస్క్ లు, శానిటేషన్ ఉచితంగా అందజేయాలని అన్నారు. శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, అదనంగా ఆర్టీసీ బస్సులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీ ల కోసం ఎక్కువగా దృష్టి పెట్టవద్దని, వారికి ఒక సమయం కేటాయించాలని తెలిపారు. జాతర కి వారం రోజుల ముందు నుండే పట్టణం మొత్తం పరిశుభ్రంగా మారాలని, ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు