ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీ పనులు స్పీడప్...పెద్దపల్లి జిల్లాలో 4 వేల ఎకరాల్లో ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగు

ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీ పనులు స్పీడప్...పెద్దపల్లి జిల్లాలో 4 వేల ఎకరాల్లో ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగు
  •     మరో 3 నెలల్లో ఉత్పత్తికి సిద్ధం
  •     ప్రభుత్వ ప్రోత్సాహంతో రెండేండ్లలో పెరిగిన సాగు
  •     వచ్చే సీజన్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇక్కడే క్రషింగ్ చేసేందుకు ఏర్పాట్లు 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో కాల్వ శ్రీరాంపూర్​ మండలం పెద్దరాత్​పల్లిలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఇండస్ట్రీ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. మరో 3 నెలల్లో ఉత్పత్తి జరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో జిల్లాలోని రైతులు ఆయిల్​పామ్​ తోటలు వేసేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 4 వేల ఎకరాల్లో సాగు జరుగుతుండగా రెండేండ్లుగా పంటల దిగుబడి వస్తోంది. పంటను ఇదివరకు ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు తరలించే రైతులు ఇకపై ఇక్కడే అమ్ముకోవచ్చు. 

ఏటా 50 వేల మెట్రిక్​ టన్నుల సామర్థ్యంతో..

వంట నూనెల వాడకం పెరిగిపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్​ పామాయిల్​ సాగుకు ప్రాధాన్యమిస్తూ రైతులకు డ్రిప్​ఇరిగేషన్​పై శిక్షణ ఇచ్చింది. ఎల్​నినో కారణంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు పంట మార్పిడి చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుండడంతో చాలా మంది రైతులు వరి కాకుండా ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఆరుతడి పంటలు వేయడంతో పాటు ఆయిల్​పామ్​తోటలు పెంచాలని నిర్ణయించుకున్నారు. కాల్వశ్రీరాంపూర్​మండలంలో 20 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.100 కోట్లతో ఆయిల్​పామ్​ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోంది. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి వచ్చే ఈ ప్యాక్టరీలో ఏటా 50 వేల మెట్రిక్​ టన్నుల సామర్థ్యంతో ఆయిల్​ఉత్పత్తి చేయనున్నారు. దీంతో జిల్లా రైతులు ఆయిల్​పామ్​వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

పామాయిల్‌‌‌‌‌‌‌‌కే ఇంపార్టెన్స్

ప్రభుత్వం ఆయిల్​పామ్ రైతులకు డ్రిప్​ స్ప్రింక్లర్లను సబ్సిడీపై ఇచ్చేందుకు నిర్ణయించింది. ఆయిల్​పామ్​ను డ్రిప్​ఇరిగేషన్ ​ద్వారా తక్కువ నీటితో సాగుచేయవచ్చు. ఆరుతడి పంటలు వేసే రైతులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం గతంలో కూడా డ్రిప్​ స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందజేసింది. ఇప్పుడు హార్టికల్చర్​డిపార్ట్​మెంట్ ప్రత్యేకంగా పామాయిల్​ రైతులకు మాత్రమే సబ్సిడీ ఇస్తుండడంతో చాలా మంది రైతులు గతంలో సాగుచేసిన ఆరుతడి పంటలను పక్కన పెట్టి పామాయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటి నుంచి ఏటా 4 వేల ఎకరాల్లో పామాయిల్​సాగు చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ సంవత్సరం 3 వేల పైచిలుకు ఎకరాల్లో సాగు ప్రారంభం కాగా  ఇందులో 1207 ఎకరాలో డ్రిప్​ సాగు నడుస్తోంది. ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తుండడం, పంటపై రైతులకు అవగాహన కల్పిస్తుండడంతో సాగు చేసుకునేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. దీంతో జిల్లాలో ఆయిల్ పామ్​ సాగు మరింత పెరగనుంది.