- 20 రోజుల్లోనే 25 డాలర్లు పెరిగిన క్రూడ్..
- బాబ్ ఎల్-మండేబ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై హౌతీ రెబల్స్ దాడులు
- హార్మూజ్ జల సంధిలో కొనసాగుతున్న టెన్షన్స్
- ఫార్మాకు షాకిచ్చిన ట్రంప్..
- 200 శాతం వరకు టారిఫ్ వేస్తామని వెల్లడి
ముంబై: స్టాక్ మార్కెట్లు మళ్లీ పడుతున్నాయి. జూన్ క్వార్టర్ ఫలితాలు బాగుండడంతో ఈమధ్య లాభాల్లో కదిలిన బెంచ్మార్క్ ఇండెక్స్లకు, గ్లోబల్ అంశాలు షాకిస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు పెరగడం, చమురు ధర 95 డాలర్లు దాటడం, ఎర్ర సముద్రాన్ని, అరేబియా సముద్రానికి కలపడంలో కీలకమైన బాబ్ ఎల్ మండేబ్ జలసంధిలో రవాణాకు అంతరాయం కలగడంతో నష్టపోతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ బుధవారం 715.06 పాయింట్లు (0.92శాతం) తగ్గి 76,755.05 వద్ద స్థిరపడగా, ఇంట్రాడేలో గరిష్టంగా 828.92 పాయింట్లు క్షీణించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 191.45 పాయింట్లు (0.79శాతం) నష్టపోయి 23,996.25 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ప్యాక్లో ఇండిగో, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తీవ్రంగా నష్టపోయాయి.
హిందూస్థాన్ యునిలీవర్ (హెచ్యూఎల్), ఎన్టీపీసీ , పవర్ గ్రిడ్, టైటాన్ లాభాలతో ముగిశాయి. రియల్టీ రంగం అత్యధికంగా 2.62శాతం పడిపోగా, సర్వీసెస్ (1.97శాతం), పీఎస్యూ బ్యాంకులు (1.83శాతం), ఐటీ (1.47శాతం), ప్రైవేట్ బ్యాంక్ సూచీలు (1.42శాతం) పతనమయ్యాయి. కేవలం ఎఫ్ఎంసీజీ రంగం మాత్రమే లాభాల్లో నిలిచింది. బీఎస్ఈలో మొత్తం 2,780 షేర్లు నష్టాల్లో ముగియగా, 1,458 షేర్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో కొరియా, షాంఘై లాభపడగా, జపాన్, హాంగ్కాంగ్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఎఫ్ఐఐలు మంగళవారం రూ. 1,650.16 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, బుధవారం రూ.810 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.
చమురు సరఫరాపై టెన్షన్
అమెరికా-–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హౌతీల కారణంగా కీలకమైన సముద్ర రవాణా మార్గాల్లో ఏర్పడిన అంతరాయాలు చమురు సరఫరాపై ఆందోళనలను పెంచాయి. దీంతో అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బుధవారం ఏకంగా 4.68శాతం పెరిగి బ్యారెల్కు 95.27 డాలర్లకు చేరింది. ఈ నెల 1న 70 డాలర్లకు పడిన ఆయిల్ ధర, కేవలం 20 రోజుల్లోనే 25 డాలర్లు పెరిగింది. క్రూడ్ ధరలు మళ్లీ పెరుగుతుండడంతో రూపాయి విలువ బుధవారం 28 పైసలు క్షీణించి 96.53 కి చేరింది.
‘‘ఎర్నింగ్ సీజన్ బాగున్నా, చాలా సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది”అని ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి తెలిపారు. ఆయిల్ ధరలు పెరగడం, యూఎస్ టారిఫ్ల ఆందోళనలు మళ్లీ పెరగడంతో ఇన్వెస్టర్ల దృష్టంతా గ్లోబల్ అంశాలపైనే ఉందని అన్నారు. కాగా, యెమెన్లోని కీలక భాగాలను నియంత్రించే హౌతీ రెబెల్స్, బాబ్ ఎల్-మండేబ్ జలసంధి గుండా వెళ్లే సరుకు రవాణా నౌకలు, చమురు ట్యాంకర్లపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేస్తున్నారు. దీంతో భారత్ నుంచి యూరప్, అమెరికా తూర్పు తీరాలకు వెళ్లే బాస్మతి బియ్యం, టీ, దుస్తులు, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతి ఖర్చులు పెరిగి విదేశీ మార్కెట్లలో భారత వస్తువులకు డిమాండ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది.
ఫార్మా ఢమాల్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జనరిక్ మందుల దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించడంతో బుధవారం భారత ఫార్మా షేర్లు తీవ్రంగా పడిపోయాయి. అమెరికాలో తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు వచ్చే నెల నుంచి రెండేళ్ల పాటు సున్నా శాతం సుంకం కొనసాగుతుందని, ఆగస్టు 2028 నుంచి 100శాతం, ఆ తర్వాత 200శాతం సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. స్వదేశీ తయారీని ప్రోత్సహించడమే దీని లక్ష్యమని తెలిపారు. ఈ నిర్ణయంతో అమెరికాకు అత్యధికంగా జెనరిక్ మందులను ఎగుమతి చేసే భారత్కు చెందిన లూపిన్ (4.21శాతం డౌన్), అరబిందో ఫార్మా (1.99శాతం), డాక్టర్ రెడ్డీస్ (1.95శాతం), గ్లెన్మార్క్, సిప్లా, సన్ ఫార్మా షేర్లు బుధవారం పడ్డాయి.
