న్యూఢిల్లీ: జూనియర్ జాతీయ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ ధంకర్ హత్య కేసులో ఒలింపియన్ సుశీల్ కుమార్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సుశీల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం మంగళవారం కొట్టేసింది. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న సుప్రీం కోర్టు ఆందోళనలను, నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటూ జస్టిస్ పురుషైంద్ర కుమార్ బెయిల్ నిరాకరించారు. సాధారణంగా బెయిల్ మంజూరు చేయడం రూల్ అయినప్పటికీ, ఈ కేసులో జరిగిన దాడి అత్యంత దారుణమని, తుపాకీ స్వాధీనం చేసుకోవడం, వీడియో ఆధారాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయని కోర్టు పేర్కొంది.
ఐదేళ్లకు పైగా అరెస్టయి ఉన్నానని, సాక్ష్యాలు కూడా పూర్తి కావస్తున్నాయని సుశీల్ కుమార్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం బాధితుడి తండ్రి వాంగ్మూలం మారినందున దాన్ని అధారంగా చేసుకుని బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ దీన్ని ఢిల్లీ పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. సుశీల్ కుమార్కు సమాజంలో ఉన్న పలుకుబడి కారణంగా సాక్ష్యాలు ప్రభావితం కావచ్చని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. దాంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. 2021 మే నెలలో అరెస్టయిన సుశీల్ కుమార్పై హత్య, నేరపూరిత కుట్ర, అల్లర్ల కింద ట్రయల్ కోర్టు అభియోగాలు మోపింది.
