గ్రేటర్వరంగల్, వెలుగు: వరంగల్ కాకతీయ జూలాజికల్ పార్కు అభివృద్ధికి కాంపా నిధులు మంజూరు చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర జూ అథారిటీ సభ్య కార్యదర్శి డాక్టర్ వి. క్లెమెంట్ బెన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. జూలో సింహాలు, హైనా, జాకల్, వైల్డ్డాగ్, సరీసృపాల ఎన్క్లోజర్లు, నైట్ షెల్టర్ల నిర్మాణానికి తెలంగాణ అటవీ శాఖ ప్రతిపాదనలు సమర్పించిందని తెలిపారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు సవరణలు చేసిన డిజైన్లు, డ్రాయింగ్లకు త్వరగా ఆమోదం ఇవ్వాలని కోరారు.
ఇదిలా ఉండగా, వరంగల్లోని పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కు అమలు పురోగతిపై ఎంపీ కడియం కావ్య లోక్సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. భూసేకరణ, మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉత్పత్తి ప్రారంభం, ఉద్యోగాల కల్పనపై వివరాలు కోరారు. స్థానిక యువత, మహిళలు, ఎస్సీలు, బీసీలకు కల్పించే ఉపాధి అవకాశాలపై స్పష్టత ఇవ్వాలన్నారు. దేశవ్యాప్తంగా ఏడు పీఎం మిత్ర పార్కులు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా తెలిపారు. అందులో వరంగల్ ఒకటని వెల్లడించారు. వరంగల్ను జౌళి రంగంలో జాతీయ స్థాయి హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎంపీ కావ్య తెలిపారు.
