
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తెరపైకి వచ్చింది. మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరును ఈడీ అధికారులు యాడ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై వ్యవహరించారని ఈడీ అధికారులు పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 8న ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అంకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్ అయ్యారు. అయితే బుచ్చిబాబుకు ఢిల్లీ సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. బుచ్చిబాబును 14 రోజుల కస్టడీకి అప్పగించింది.
మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో దర్యాప్తు చేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 2022 డిసెంబర్ లో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవితను విచారించారు. 160 సీఆర్పీసీ చట్టం ప్రకారం కవితను సాక్షిగా విచారించారు. మద్యం కేసులో ఆమెపై అనేక ప్రశ్నలు సంధించారు. కవిత వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు.