
బెంగళూరు: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ట్రాన్సాక్షన్స్ వచ్చే రెండు, మూడేళ్లలో రోజుకు వంద కోట్ల మార్క్ను తాకుతాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ దిలీప్ ఆస్బే తెలిపారు. ఇండియాలో యూపీఐ పదింతల గ్రోత్ను నమోదు చేసిందన్నారు. ఇదే రేటులో మరింత పెరుగుతుందన్నారు. యూపీఐ ప్లాట్ఫామ్పై కొత్త విభాగాలు కూడా యాడ్ అవుతాయన్నారు. యూపీఐ ద్వారా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)ల్లో రిటైల్ ఇన్వెస్టింగ్ చేయడం వంటి కొత్త ఫీచర్లను తెస్తామని బెంగళూరు టెక్ సమిట్ 2020లోని ప్యానల్ డిస్కషన్లో ఆస్బే తెలిపారు. ఇప్పటికే యూపీఐ ప్లాట్ఫామ్పై ఆటోపే ను యాడ్ చేసింది. ఇది పేమెంట్ ల్యాండ్స్కేప్ను చాలా వరకు మార్చింది.
అక్టోబర్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ 200 కోట్ల మార్క్ను దాటిన తర్వాత… మరిన్ని యూస్ కేసులు ఈ ప్లాట్ఫామ్పై యాడ్ అయ్యేందుకు అప్రూవల్కు సిద్ధంగా ఉన్నాయని ప్యానల్ డిస్కషన్లో చెప్పారు. ఈ ప్యానల్ డిస్కషన్లో బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఆసియా పసిఫిక్ చీఫ్ రిప్రజెంటేటివ్ సిద్ధార్థ తివారి, ఫిన్టెక్ ఏపీఐ ప్రొవైడర్ సేతు కోఫౌండర్ నిఖిల్ కుమార్ పాల్గొన్నారు. యూపీఐ ద్వారా దేశంలో క్యాష్ సర్క్యులేషన్ తగ్గించే ప్లాన్లో తాము ఉన్నట్టు చెప్పారు. అంతకుముందు ఇచ్చిన వాగ్దానాన్ని తాము నెరవేరుస్తామని, వచ్చే ఏళ్లలో కూడా పదింతల గ్రోత్ను నమోదు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్బీఐతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని, దేశంలో యూపీఐ మోస్ట్ ప్రిఫరబుల్ ఎకోసిస్టమ్ అని కొనియాడారు.
యూపీఐ డేటా చోరి కాకుండా చూడాలి -సుప్రీంకోర్టులో పిటిషన్…
యూపీఐ ప్లాట్ఫామ్స్ ద్వారా సేకరిస్తోన్న డేటా చోరికి గురికాకుండా ఉండేలా.. ఆర్బీఐ రెగ్యులేషన్ను ఫ్రేమ్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని రాజ్యసభ ఎంపీ, సీపీఐ నేత బినోయ్ విశ్వమ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ఈ నెల 23న విచారించనున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. పేమెంట్స్కు కాకుండా మరే ఇతర అవసరాలకు దీన్ని వాడకుండా ఉండేలా ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేయాలని విశ్వమ్ సుప్రీంకోర్టును కోరారు. అంతేకాక యూపీఐ ప్లాట్ఫామ్స్పై సేకరించే డేటాను పేరెంట్ కంపెనీకి కానీ మరే ఇతర థర్డ్ పార్టీకి షేర్ చేయకుండా చూడాలని అన్నారు. ఈ విషయంపై ఆర్బీఐ, ఎన్పీసీఐకి ఆదేశాలు జారీ చేయాలన్నారు. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ల బెంచ్ దీనిపై విచారణ చేపట్టనుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పిటిషన్పై ఆర్బీఐ, ఎన్పీసీఐ, గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, అమెజాన్లు స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.