ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నూత‌న అగ్రి చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహ‌ద్దుల్లో అన్న‌దాత‌లు చేస్తున్న ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఇవాళ్టి(గురువారం)తో ఈ ఆందోళ‌న‌లు 71వ రోజుకు చేరుకున్నాయి. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు తేల్చిచెబుతున్నారు. సింఘ‌, టిక్రి, గాజీపూర్ స‌రిహ‌ద్దుల్లో ఆందోళ‌నల్లో పాల్గొంటున్న రైతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. జనవరి 26 ఘటన తర్వాత రైతులు వెనక్కి తగ్గుతారని అంతా అనుకున్నా, రైతులు మాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా ఆందోళనలు మరింత ఉదృతం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఇంట‌ర్‌నెట్ సేవ‌లు నిలిపివేసింది. దీంతో ఇందుకు నిర‌స‌న‌గా.. ఫిబ్రవరి 6 వ తేదీన రాష్ట్ర, జాతీయ రహదారులను దిగ్బంధం చేసేందుకు రైతులు సిద్ధం అయ్యారు. ‘చుక్కా జామ్’ పేరుతో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి 3 గంట‌ల వ‌ర‌కు ర‌హ‌దారులు దిగ్భందించాల‌ని రైతులు నిర్ణ‌యించారు. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ వస్తుండటంతో.. ఢిల్లీ పోలీసులు సరిహద్దుల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బారీకేడ్లు, సిమెంట్ దిమ్మెలతో సరిహద్దులను మూసేశారు. అంతేకాదు… ఢిల్లీ సరిహద్దుల్లో ఆంక్షలు విధించారు.