ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

బషీర్ బాగ్, వెలుగు : ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ. లక్ష 50 వేల నగదు, రెండు ల్యాప్ టాప్ లు , ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సిటీలోని దిల్ సుఖ్ నగర్ కు చెందిన బి.ఉదయ్ సింహారెడ్డి, మహ్మద్ ఫహీముద్దీన్, ఎం. భాను ఎంజాయ్ చేసేందుకు ఈజీ మనీ కోసం ఈ – క్రికెట్ బెట్టింగ్ ను ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. www.happybetplay.com , www.happycriket.com వెబ్ సైట్లలో లాగిన్ అయి పలువురి వద్ద బెట్టింగ్ లు తీసుకునేవారు. లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ – 2024 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా భారీగా బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం కాచిగూడ చౌరస్తాలో స్వీకర్ హోటల్ పార్కింగ్ వద్ద ముగ్గురిని అదుపులోకి తీసుకుని సుల్తాన్ బజార్ పోలీసులకు అప్పగించారు.