- సోనియాకు ఈడీ నోటీసులపై కాంగ్రెస్ నిరసనలు
- లోక్సభ నుంచి మెజారిటీ ప్రతిపక్షాల వాకౌట్
- రాజ్యసభలో మాత్రం యథావిధిగా క్వశ్చన్ అవర్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షాలు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల పెంపు, అగ్నిపథ్ స్కీములపై నిరసనలను కొనసాగించాయి. ప్రతిపక్షాల ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో ఉభయ సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి.
లోక్సభలో నిరసనలు.. నినాదాలు
గురువారం ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి ఈడీ నోటీసులు, ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్లపై ఆందోళనకు దిగాయి. సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని స్పీకర్ ఓంబిర్లా కోరినా.. ప్రతిపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ కొద్దిసేపు సభను వాయివా వేశారు. 11.30 నిమిషాలకు సభ తిరిగి మొదలైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సోనియాకు ఈడీ నోటీసులపై కాంగ్రెస్ సభ్యులు సభను బాయ్కాట్ చేసి.. పార్లమెంట్ బయట ఆందోళనకు దిగారు. ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్ల పెంపుపై చర్చకు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, టీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్షాలు ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబడుతున్నాయని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆరోగ్యం మెరుగుపడగానే దీనిపై చర్చిద్దామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాబట్టి సోనియా సూపర్ హ్యూమన్ కాదని, చట్టం దగ్గర అందరూ సమానమే అనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తించాలని సూచించారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభను మధ్యాహ్నం 2.15 వరకు సభ వాయిదా పడింది. సభ తిరిగి మొదలయ్యాక ఇండియన్ అట్లాంటిక్ బిల్లు 2022పై చర్చ జరగాల్సి ఉంది. మెజారిటీ ప్రతిపక్ష సభ్యులు సభలో లేకపోవడంతో ఈ బిల్లుపై చర్చను వాయిదా వేశారు. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
మూడు రోజుల తర్వాత క్వశ్చన్ అవర్
రాజ్యసభలో కూడా ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. సభ మొదలుకాగానే ధరల అంశం, జీఎస్టీపై చర్చకు పట్టుబడుతూ కార్యకలాపాలను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో 12 గంటలకు వాయిదా పడింది. ఆపై సభలో క్వశ్చన్ అవర్ మొదలైంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఈ సమయంలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్యే సభను కొనసాగించారు. రాజ్యసభలో ద వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, డెలివరి సిస్టమ్స్(ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్) అమెండ్మెంట్ బిల్లు, 2022పై చర్చ మొదలైంది. ఇందులో బీజేడీ, అన్నాడీఎంకే, వైఎస్సార్సీపీ, ఆర్జేడీ, టీడీపీ, జేడీయూ, బీజేపీ, డీఎంకే సభ్యులు పాల్గొన్నారు. మెజారిటీ ప్రతిపక్ష సభ్యులు సభలో లేకపోవడంతో ఈ కీలకమైన బిల్లుపై తర్వాత చర్చిద్దామని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ సభను కోరారు. ఆ తర్వాత సభను శుక్రవారానికి వాయిదా వేశారు.