ఆపరేషన్ సిందూర్‎పై పార్లమెంట్‎లో చర్చిద్దాం: ప్రధాని మోదీకి ప్రతిపక్షాల లేఖ

ఆపరేషన్ సిందూర్‎పై పార్లమెంట్‎లో చర్చిద్దాం: ప్రధాని మోదీకి ప్రతిపక్షాల లేఖ

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌‌పై పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇండియా కూటమికి చెందిన 16 ప్రతిపక్ష పార్టీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం లెటర్ రాశాయి. పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్, భారత్~-పాకిస్తాన్ సీజ్‌‌ఫైర్ ఒప్పందంపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం అవసరమని స్పష్టం చేశాయి. 

ఈ లేఖపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సమాజ్‌‌వాదీ పార్టీ, డీఎంకే, శివసేన (యూబీటీ), ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఐ(ఎం), సీపీఐ, జేఎంఎం, వీసీకే, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్, ఎండీఎంకే, సీపీఐ (మార్క్సిస్ట్ -లెనినిస్ట్) లిబరేషన్ పార్టీలు సంతకాలు చేశాయి. అంతకు ముందు ఢిల్లీలోని కాన్‌‌స్టిట్యూషన్ క్లబ్‌‌లో ఇండియా కూటమి సమావేశం నిర్వహించింది. దీనికి కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేశ్, దీపేందర్ సింగ్ హూడా, టీఎంసీ నేతలు డెరెక్ ఓబ్రెయిన్, సమాజ్‌‌వాదీ పార్టీకి చెందిన రామ్‌‌గోపాల్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, శివసేన (యూబీటీ)నేత సంజయ్ రౌత్ హాజరయ్యారు. 

సమావేశం అనంతరం టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తమతో సహా16 పార్టీలు ప్రధానికి లేఖ రాశాయన్నారు. ప్రభుత్వం పార్లమెంటుకు, పార్లమెంటు ప్రజలకు బాధ్యత వహిస్తుందని.. అందుకే తాము ప్రత్యేక సమావేశాన్ని డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. విదేశాలకు వెళ్లిన ప్రతినిధుల బృందాలు తిరిగి వచ్చిన తర్వాత జూన్‌‌లోనే సెషన్ నిర్వహించాలని కేంద్రాన్ని కోరారు.

జులైలో వర్షాకాల సమావేశాలు

ఇండియా కూటమి డిమాండ్‌‌ను కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. జులైలో వర్షాకాల సమావేశాలు ఉంటాయి కాబట్టి ప్రత్యేక సమావేశాలను ప్లాన్ చేయలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మాన్సూన్ సమావేశం దగ్గర పడుతున్న సమయంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం సమర్థనీయం కాదన్నాయి. ప్రత్యేక సమావేశాలపై ప్రతిపక్షాలకే ఏకాభిప్రాయం లేదన్నాయి. మాన్సూన్ సమావేశంలోనే ఆపరేషన్ సిందూర్‌‌ అంశంపై చర్చకు అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.