రెండు పార్టీల నేతల మధ్యన జరిగిన ఘర్షణలో సర్పంచ్ దంపతులతో పాటు.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగింది. శంషాబాద్ మండలం లోని అలీకోల్ తండాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీకి చెందిన రాణి రవినాయక్ సర్పంచ్ గా ఎన్నిక అయ్యారు. ఆ తరువాత జరిగిన MPTC ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ క్రమంలో సర్పంచ్ మరియు టీఆర్ఎస్ వర్గీయులకు మధ్య రాజకీయ పగలు నెలకొన్నాయి.
అయితే సోమవారం ఉదయం అలీకోల్ తండాకు చెందిన టీఆర్ఎస్ వర్గీయులు సర్పంచ్ తో డబ్బుల విషయంలో గొడవకు దిగారు. గొడవ కాస్త ముదరడంతో టీఆర్ఎస్ వర్గీయులు.. సర్పంచ్ దంపతులతో పాటు సర్పంచ్ అనుచరులపై కర్రలు, రాళ్ళతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సర్పంచ్ దంపతులతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ మేరకు బాధితులు శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.