
హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ తో వాయిదా పడ్డ డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ ను జులై మొదటివారంలో నిర్వహించాలని ఓయూ స్టాండింగ్ కమిటీ తీర్మానించింది. జూన్ 20 నుంచి పరీక్షలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్నందున జులై మొదటి వారంలో డిగ్రీ, జులై 15 నుంచి పీజీ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. అప్పటికి కేసులు తగ్గితేనే ఎగ్జామ్స్ పెట్టాలని లేకుంటే మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని సభ్యులు సూచించారు. ఎగ్జామ్ హాల్ ను శానిటైజ్ చేసి.. ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా బెంచ్కు ఒక స్టూడెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. ఎగ్జామ్ టైమ్ ను 3 నుంచి 2 గంటలకు కుదించినట్లు ఓయూ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి ఆదివారం చెప్పారు. ఈ మేరకు క్వశ్చన్ పేపర్లలోనూ మార్పులు ఉంటాయన్నారు. బ్యాక్లాగ్స్ ఉన్నవారిని డిటెండ్ చేయకుండా ప్రమోట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. స్టాండింగ్ కమిటీ తీర్మానాలను ప్రభుత్వానికి, ఉన్నత విద్యా మండలికి పంపుతామని చెప్పారు. ప్రభుత్వ అనుమతితో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.