దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా తయారైందన్నారు ప్రధాని మోడీ. దీనికి కారణం.. బ్యాంకింగ్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు, గత ఆరేడేళ్ల నుంచి ఆ రంగానికి లభిస్తున్న మద్దతేనని అన్నారు. బిల్డ్ సినర్జీ ఫర్ సీమ్లెస్ క్రెడిట్ ఫ్లో అండ్ ఎకనామిక్ గ్రోత్ అన్న అంశంపై జరిగిన చర్చలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.
2014 కన్నా ముందు ఉన్న అన్ని సమస్యలకు తాము దారులు వెతికినట్లు ప్రధాని మోడీ చెప్పారు.NCA సమస్యలను, బ్యాంకుల రిక్యాపిటలైజేషన్, ఐబీసీ సంస్కరణలు చేపట్టామన్నారు. అప్పుల రికవరీ కోసం ట్రిబ్యునల్ను బలోపేతం చేసినట్లు తెలిపారు. కరోనా టైంలో కూడా బ్యాంకులు మెరుగ్గా కోలుకున్నట్లు చెప్పారు. బ్యాంకులు మరింత బలోపేతం అవుతున్నాయని, వాటిలో కొత్త శక్తి వచ్చినట్లు ఆయన తెలిపారు. బ్యాంకుల దగ్గర రుణం తీసుకుని ఎగ్గొట్టి పారిపోయేవాళ్లు ఉన్నారని.. దాని గురించి అందరూ చర్చిస్తారని, కానీ ఓ ప్రభుత్వం చాలా సాహసం చేసి ఆ రుణఎగవేత దారులను పట్టుకువస్తోందన్నారు.. దాని గురించి ఎవరూ చర్చించుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వాల సమయంలో స్తంభించిపోయిన లక్షల కోట్ల రూపాయాల్లో తమ ప్రభుత్వం 5లక్షల కోట్లకు పైగా రికవరీ చేసినట్లు ప్రధాని మోడీ తెలిపారు.