న్యూఢిల్లీ: కర్తార్ పూర్ కారిడార్ పై చర్చించేందుకు భారత్ – పాక్ ప్రతినిధులు మార్చి 14న ఢిల్లీలో సమావేశం కానున్నారని కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. ఈ విషయంలో సిక్కు సమాజానికి ఇచ్చిన కమిట్మెంట్ కు ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారని చెప్పారామె. ఇందుకు తామంతా ఆయనకు రుణ పడి ఉంటామన్నారు. పుల్వామా దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ కర్తార్ పూర్ కారిడార్ విషయంలో అనుకున్న ప్రకారం చర్చలు జరుగుతాయని హర్ సిమ్రత్ చెప్పారు.
పాకిస్థాన్ లోని గురుద్వారా కర్తార్ పూర్ సాహిబ్ సందర్శనకు భారత భక్తులకు వీసా లేకుండా వెళ్లేందుకు వీలు కల్పిస్తుంది ఈ కర్తార్ పూర్ ప్రాజెక్టు. దీనికి సంబంధించిన ముసాయిదాపై చర్చించేందుకు పాక్ బృందం ఈ నెల 14 ఢిల్లీకి వస్తోంది. ఆ తర్వాత 28వ తేదీన భారత బృందం ఇస్లామాబాద్ వెళ్లి చర్చలు జరుపుతుంది.
ఫిబ్రవరి 14 పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై సాక్ బేస్డ్ జైషే మహమ్మద్ దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయినప్పటికీ కర్తార్ పూర్ కారిడార్ విషయంలో చర్చలకు కట్టుబడి ఉన్నామని ఇరు దేశాలు ప్రకటించాయి.
