
- తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ
- కాంగ్రెస్ నేతలపై మండిపాటు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన 30 నిమిషాల తర్వాతే పాకిస్తాన్కు సమాచారం ఇచ్చామని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. టెర్రరిస్టుల శిబిరాలపై దాడులు చేసినట్లు కన్ఫర్మేషన్ ఇచ్చామని పేర్కొన్నారు. పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉండేందుకే దాడి గురించి పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కు తెలియజేశామన్నారు. సోమవారం క్రాస్ బార్డర్ టెర్రరిజంపై జరిగిన పార్లమెంట్ కాన్సులేటివ్ కమిటీ మీటింగ్లో జైశంకర్ మాట్లాడారు. అప్పటికే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కూడా ప్రకటన వెలువడిందన్నారు.
మరోసారి టెర్రరిస్టుల దాడి జరిగితే చాలా స్ట్రాంగ్గా దెబ్బకొడతామని పాకిస్తాన్, అమెరికాను హెచ్చరించినట్లు తెలియజేశారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభానికి ముందే పాకిస్తాన్కు సమాచారం అందించామని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అబద్ధమని జై శంకర్ చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు చెప్తున్నవన్నీ తప్పుడు మాటలేనని, వాస్తవాలను వక్రీకరించారని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్లో అమెరికా జోక్యంపైనా ఆయన స్పష్టతనిచ్చారు.
పాక్ పెద్ద ఎత్తున ప్రతీకారం తీర్చుకోవచ్చని అమెరికా విదేశాంగ కార్యదర్శి నుంచి సమాచారం అందిందని పేర్కొన్నారు. ‘‘వారు కాల్పులు ఎంత తీవ్రంగా జరిపితే అంతే తీవ్రతతో దాడులు చేస్తం. వాళ్లు ఆపితే మేం ఆపుతం’’ అని అమెరికాకు సమాచారం ఇచ్చామని చెప్పారు.
రాహుల్ ఏమన్నారంటే..
ఆపరేషన్ సిందూర్ గురించి ముందుగానే పాక్కు సమాచారం ఇచ్చారని, ఈ విషయాన్ని జైశంకర్ బహిరంగంగానే అంగీకరించారని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఆరోపించారు. జైశంకర్ మాట్లాడు తున్న వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. దాడి ప్రారంభంలోనే పాక్కు సమాచారం ఇవ్వడం నేరం అని, ఫలితంగా మన వైమానికి దళం ఎన్ని విమానాలను కోల్పోయిందో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. ఆపరేషన్కు ముందే పాక్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు జైశంకర్ ఎప్పుడూ చెప్పలేదని పేర్కొంది.