
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్)కు చెందిన 3 రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ ప్రకటనలను డసాల్ట్ ఏవియేషన్ చైర్మన్, సీఈవో ఎరిక్ ట్రాపియర్ కొట్టిపారేశారు. మూడు రాఫెల్ విమానాలను కూల్చివేశామని చెబుతున్న పాక్ మాటల్లో ఎలాంటి నిజం లేదని ఫ్రెంచ్ మ్యాగజీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.
రాఫెల్ విమానాలను ఫ్రెంచ్ కంపెనీ తయారు చేసిందని, అయితే, వీటిని పాక్ కూల్చివేసిందని ఐఏఎఫ్ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పింది. వైమానిక పోరాటంలో, నిఘా వ్యవస్థలో రాఫెల్ విమానాలు అసమాన సామర్థ్యాలను ప్రదర్శించాయని ఆయన పేర్కొన్నారు. మల్టీ రోల్ ఫైటర్ జెట్గా రాఫెల్ అద్భుతంగా పనిచేయగలదని తెలిపారు.
ఎయిర్ టు ఎయిర్, నిఘా వ్యవస్థలో, గ్రౌండ్ స్ట్రైక్స్, న్యూక్లియర్ డిటరెన్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లలో మోహరించగల ఒకే ఒక్క విమానం రాఫెల్ అని అన్నారు. అమెరికాకు చెందిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ కంటే రాఫెల్ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. అలాగే, చైనా ఫైటర్ జెట్ల కంటే కూడా ఇది మెరుగ్గా ఉంటుందన్నారు.