హనుమకొండ, వెలుగు : డబుల్ బెడ్ రూం ఇండ్ల ఫైనల్ మెజర్మెంట్స్ను ఎంబీ రికార్డ్స్లో నమోదు చేసి, బిల్లు మంజూరు చేసేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేసిన పాలకుర్తి ఇరిగేషన్ డీఈఈ గంటి శ్రీకాంత్ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కన్వాయిగూడెం గ్రామానికి చెందిన కర్ర అశోక్రెడ్డి 2018 నుంచి 2020 వరకు గ్రామంలో పది డబుల్బెడ్రూం ఇండ్ల పనులను పూర్తి చేశాడు.
ఈ పనులకు సంబంధించిన ఫైనల్ మెజర్స్మెంట్స్ ఎంబీ రికార్డులో నమోదు చేయాలని ఇరిగేషన్ ఏఈగా పనిచేసిన గంటి శ్రీకాంత్ను కోరారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ ప్రమోషన్పై డీఈఈగా పాలకుర్తికి వచ్చాడు. డబుల్ ఇండ్లకు సంబంధించిన ఫైనల్ మెజర్మెంట్స్ రికార్డు చేయకుండా, బిల్లు మంజూరు చేయకుండా అశోక్రెడ్డిని తిప్పించుకుంటున్నారు.
చివరకు.. పని పూర్తి కావాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని శ్రీకాంత్ డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ అశోక్రెడ్డి ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో... సోమవారం హనుమకొండలోని భవానీనగర్లో ఉన్న డీఈఈ శ్రీకాంత్ను కలిసి రూ.50 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు డీఈఈ శ్రీకాంత్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఈఈని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
