జులైలో పంచాయతీ ఎన్నికలు.. పది రోజుల గ్యాప్లోనే ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు

జులైలో పంచాయతీ ఎన్నికలు.. పది రోజుల గ్యాప్లోనే ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా జులై నెలలో పంచాయతీ ఎన్నికల నిర్వహించేందుకు రంగం సింద్ధం చేసింది ప్రభుత్వం.
 
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జూన్ నెలాఖరున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం. ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి.. తరువాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ సింబల్ తో ఉంటాయి కాబట్టి.. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత పది రోజుల గ్యాప్ లోనే  సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 

గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు గతేడాది ఫిబ్రవరిలోనే ముగియగా.. దాదాపు ఏడాదిన్నరగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,600 కోట్లకు పైగా ఆగిపోయాయి. పాలకవర్గాలు ఎన్నికైతేనే ఈ నిధులు వస్తాయి. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు నిరుడు జులై మొదటి వారంలో.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గడువు గత నెలలోనే ముగిశాయి. 

వీటికి కూడా ఫైనాన్స్​ కమిషన్ నిధులు ఆగిపోయాయి. ప్రస్తుతం అన్నిచోట్లా ఇన్​చార్జ్‎ల పాలన నడుస్తున్నది. ఒక అధికారి ఐదారు పంచాయతీలు, మండలాలు లేదా మున్సి పాలిటీలను పర్యవేక్షిస్తుండటంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా,  కాంగ్రెస్ పార్టీ పదేండ్ల తర్వాత అధికారంలోకి రావడంతో గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు స్థానిక పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ లాంటి పదవులు దక్కితే పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రె స్ పెద్దలు భావిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో.. జూన్​ చివరి వారంలో లేదా జులై మొదటి వారం నుంచి స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. 

పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు

వాస్తవానికి పంచాయతీ ఎన్నికలను గతేడాదే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ, అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం సమగ్ర కుల గణన సర్వే చేపట్టింది. అనంతరం బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి,  ఆమోదించింది.

ఇందుకు సంబంధించిన రెండు బీసీ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్​లో ఉన్నాయి. ఇటీవల కేంద్ర కేబినెట్​  కూడా దేశవ్యాప్తంగా జన గణనతో పాటు కుల గణన చేసేందుకు అంగీకరించింది. ఇది పూర్తయ్యేందుకు మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రం చేసిన కుల గణన వివరాల ఆధారంగా పంపిన స్థానిక బీసీ రిజర్వేషన్ల బిల్లులను రాష్ట్రపతి ఆమోదిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

ఇందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతోఈసారి పార్టీ పరంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఇతర పార్టీలు కూడా బీసీలకు అంతే మొత్తంలో రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని.. దీంతోనైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు అవుతుందని కాంగ్రెస్​ వర్గాలు అంటున్నాయి.