జైపూర్: కరెంటు షాక్ తగిలి చిరుత మృతిచెందిన సంఘటన శుక్రవారం రాజస్థాన్ లో జరిగింది. భిల్వారా జిల్లా కరేడా ఏరియాలోని రామ్ పూర్ గ్రామంలో కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత కళేబరాన్ని పోస్టుమార్టానికి తరలించారు. చిరుతపులి నీటి జాడ కోసం వెతుక్కుంటూ రామ్పూర్ గ్రామానికి చేరుకుని ఉంటుందని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ దేవేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.
నీటి కోసం వెతికే క్రమంలోనే చిరుత చెట్టుపైకి ఎక్కి ఉంటుందని, అయితే సమీపంలోని గ్రానైట్ గనికి విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన హైటెన్షన్ విద్యుత్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతిచెందిందని ఆయన చెప్పారు. ఈ ఘటనపై తాము సమగ్ర దర్యాప్తు జరుపుతామని, చిరుత మృతికి కచ్చితమైన కారణాలు ఏమిటో దర్యాప్తులో వెల్లడవుతాయని తెలిపారు.