- పదేండ్లు ఆగం చేసి.. 4 నెలలకే ఆరోపణలు చేస్తున్నరు : రామ్మోహన్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్రెడ్డిని సవాల్ చేసే స్థాయి ఎమ్మెల్యే హరీశ్ రావుకు లేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతారని తెలిపారు. హరీశ్రావు సవాల్ చేసే ముందు తన స్థాయి తెలుసుకోవాలని సూచించారు. అతని స్థాయికి సీఎం అవసరం లేదని, తాను చాలని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పదేండ్లు ఆగం చేసిందని, విధ్వంసమైన రాష్ట్రాన్ని తాము గాడిలో పెడుతున్నామని తెలిపారు. నాలుగు నెలలకే అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ ఆదేశాల మేరకే హరీశ్ రావు సవాల్ విసురుతున్నడా ? లేదా? చెప్పాలి. 100 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసినం. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తం. హామీలన్నీ అమలు చేస్తం. ఆగస్టు 15 తర్వాత మూటముల్లె సదురుకొని ఫాంహౌజ్ కు వెళ్లేందుకు రెడీగా ఉండు హరీశ్. దమ్ముంటే మెదక్ ఎంపీ సీటు గెలుచుకో’ అని రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ టచ్లో లేరని, రోజుకో ఎమ్మెల్యే పార్టీ వీడుతుంటే కేసీఆరే భయపడుతున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన విధంగా తెలంగాణలో బీజేపీకి వర్కవుట్ కాదని, ఎన్నో ఏండ్ల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చి తెలంగాణ ఇచ్చిందని, ఆ రుణాన్ని ప్రజలు మరువరని రామ్మోహన్ రెడ్డి తెలిపారు.