- నరవణె పుస్తక వివాదంతో సభలో కొనసాగిన గందరగోళం
- మొత్తం 19 గంటలు వృథా అయ్యిందన్న స్పీకర్
- మార్చి 9 నుంచి రెండో విడత పార్లమెంట్ సమావేశాలు
- స్పీకర్ తొలగింపుపై చర్చ!
న్యూఢిల్లీ: పార్లమెంట్ మొదటి విడత బడ్జెట్ సెషన్ శుక్రవారంతో ముగిసింది. 3 వారాల తాత్కాలిక విరామం(రెసెస్) తర్వాత మార్చి 9న రెండో విడత బడ్జెట్ సెషన్ మొదలై, ఏప్రిల్ 2 వరకు కొనసాగనుంది. రెసెస్ కాలంలో యూనియన్ బడ్జెట్లో ప్రతిపాదించిన నిధుల కేటాయింపుల(డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్)ను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు పరిశీలిస్తాయి.
బడ్జెట్కు అవసరమైన సలహాలు, సవరణలు సూచిస్తాయి. కమిటీల నివేదికల ఆధారంగా రెండో విడత సమావేశంలో బడ్జెట్పై చర్చించి కేటాయింపులను ఆమోదిస్తారు. ఫైనాన్స్ బిల్ పాస్ చేస్తారు. ఇతర బిల్లులు కూడా ప్రవేశపెట్టి, వాటిపై చర్చిస్తారు.
మొదటి విడతంతా వాయిదాలే..
పార్లమెంట్ మొదటి విడత బడ్జెట్ సెషన్ అంతా వాయిదాలు, నిరసనలు, సస్పెన్షన్లతో కొనసాగింది. జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభమైంది. ఈ నెల 2న లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై కొనసాగిన చర్చలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడారు.
2020లో భారత్, చైనా సరిహద్దు సంఘర్షణపై మాజీ సైన్యాధిపతి నరవణె రాసిన పుస్తకం గురించి చర్చించేందుకు ప్రయత్నించారు. కానీ, దానికి స్పీకర్ ఓం బిర్లా అనుమతించలేదు. అయినా ఆ పుస్తకంపై రాహుల్ గాంధీ పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. సభ ఒక రోజు మొత్తం వాయిదా పడింది.
19 గంటల 13 నిమిషాలు వృథా..
భారత్-, యుఎస్ మధ్యంతర ట్రేడ్ డీల్పై కూడా ప్రతిపక్షం నిరసన చేసింది. ఈ డీల్ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎప్స్టీన్ ఫైల్స్తో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూనియన్ మంత్రి హర్దీప్ సింగ్ పురి రాజీనామా కోరుతూ కూడా నినాదాలు, ప్రదర్శనలు నిర్వహించారు.
మొత్తంగా మొదటి సెషన్ లో 19 గంటల 13 నిమిషాలు వృథా అయిందని సభకు స్పీకర్ వెల్లడించారు. కాగా, ఈ అవిశ్వాస తీర్మానం మార్చి 9న మొదలయ్యే బడ్జెట్ సెషన్ రెండో భాగంలో చర్చకు రావచ్చు. బిర్లా కూడా తన తొలగింపుకు సంబంధించిన సమస్య పరిష్కారమయ్యే వరకు సభ కార్యకలాపాలకు అధ్యక్షత వహించకూడదని నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే వెల్లడించారు.
