
- హైవేలపై వరుస చోరీలు చేస్తున్న నిందితులు
- ముఠా సభ్యులపై ఒక హత్యతో పాటు మరో 31 కేసులు
- ఇద్దరు అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు
నల్గొండ అర్బన్, వెలుగు : రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లతో పాటు సంగారెడ్డి, నల్గొండ జిల్లాలో వరుస నేరాలు చేస్తున్న పార్థీ గ్యాంగ్లోని కొందరు సభ్యులను నల్గొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను నల్గొండ ఎస్పీ శరత్ చంద్రపవార్ శనివారం మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన అప్ప పాండ్రంగ, శుభం అశోక్ అలియాస్ దిల్షార్, కశ్మీర్ శశిపాల్ భోంస్లే అలియాస్ కశ్మీర్, అధేశ్ అనిల్ ఖలే ముఠాగా ఏర్పడ్డారు. వీరు తెలంగాణకు వచ్చి నల్గొండ జిల్లా చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూర్ పోలీస్ స్టేషన్లతో పాటు సంగారెడ్డి జిల్లాలో, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పార్క్ చేసిన బైక్లను అపహరించేవారు.
తర్వాత వాటిపై తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇండ్లను గుర్తించి చోరీలు చేసేవారు. బైక్లను శివార్లలో వదిలేసి దొంగిలించిన సొమ్ముతో పారిపోయేవారు. అలాగే హైవేలపై నిలిపి ఉన్న లారీలు, కార్ల డ్రైవర్లు, ప్రయాణికులను బెదిరించి, దాడి చేసి వారి వద్ద ఉన్న డబ్బులు, బంగారం దోచుకొనిపోయేవారు. ఏపీలోని కృష్ణా జిల్లా చాట్లవానిపురం గ్రామానికి చెందిన కొల్లూరి రాజవర్ధన్ మే 18న కట్టంగూర్ పీఎస్ పరిధిలో తన టాటా మినీ గూడ్స్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి నిద్రిస్తున్నాడు.
ఈ టైంలో అక్కడికి వచ్చిన గ్యాంగ్ రాజవర్ధన్ కాళ్లు, చేతులు కట్టేసి విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు స్క్రూ డ్రైవర్తో పొడిచి హత్య చేసిన అనంతరం అతడి వద్ద ఉన్న రూ. 14,500 తీసుకున్నారు. అక్కడి నుంచి వెళ్తూ పామనగుండ్ల గ్రామంలో ఓ హోండా షైన్ బైక్ను చోరీ చేసి, దానిపై తిరుగుతూ ఆరుబయట పడుకున్న వారి మెడలోనుంచి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వరుస చోరీల జరుగుతుండడంతో అలర్ట్ అయిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్గొండ- డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో నార్కట్పల్లి సీఐ నాగరాజు, చిట్యాల ఎస్సై సైదాబాబుతో దర్యాప్తు టీంను ఏర్పాటు చేశారు .
ఆచూకీ దొరికింది ఇలా..
ఘటనా స్థలాల్లో దొరికిన ఆధారాలతో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు నేరాలు చేసేది పార్థీ గ్యాంగ్ అని నిర్ధారించారు. తర్వాత గ్యాంగ్ మెంబర్స్ కదలికలపై నిఘా పెట్టి సెల్ఫోన్ సిగల్స్ ఆధారంగా ఈ నెల 5న వారిని వెంబడించారు. పోలీసులను పసిగట్టిన ముఠా సభ్యులు పారిపోయేందుకు చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆటో ఎక్కారు. పోలీసులు ఆటోను వెంబడించడంతో హయత్నగర్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఆటోని ఆపి పారిపోయేందు ప్రయత్నిచారు.
ఈ టైంలో ఆటో దగ్గరకు వచ్చిన పోలీసులు ముఠా సభ్యులను లొంగిపోవాలని సూచించారు. దీంతో నిందితులు వారి వద్ద ఉన్న స్క్రూడ్రైవర్, కత్తెరతో పోలీస్లపై దాడి చేసి పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ విక్రమ్ శంకర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు తమ పిస్టల్స్తో గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపుతూ ముఠా సభ్యులైన అప్ప పాండ్రంగ, శుభం అశోక్ అలియాస్ దిల్షార్ను అదుపులోకి తీసుకున్నారు.
వారిని నార్కట్పల్లి పీఎస్కు తరలించి విచారించగా నల్గొండ జిల్లాలో ఆరు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 13, సంగారెడ్డి జిల్లాలో 11, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు చోట్ల నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ఒకరిని హత్య చేయడంతో పాటు ఆరు చోరీలు, ఏడు చైన్ స్నాచింగ్లు, ఎనిమిది బైక్లు, 10 ఇండ్లలో చోరీలు చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ. 17 వేలు, రెండు కత్తెరలు, రెండు వెండి కాళ్ల పట్టీలు, ఒక చేతి రుమాలు మరియు టార్ట్లైట్ను స్వాధీనం చేసుకున్నారు.
కాశ్మీర్ శశిపాల్ భోంస్లే, అదేశ్ అనిల్ ఖలే పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. ముఠా సభ్యులను పట్టుకున్న సిబ్బంది విష్ణువర్ధనగిరి, మోహసీన్ పాషా, విక్రమ్ శంకర్, సాయిరాం కలీమ్, సాయికుమార్ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.