మానుకోటపై కాంగ్రెస్​ధీమా.. టికెట్​ వస్తే గెలుపు పక్కా అంటున్న ఆశావహులు

మానుకోటపై కాంగ్రెస్​ధీమా.. టికెట్​ వస్తే గెలుపు పక్కా అంటున్న ఆశావహులు
  •    అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు చోట్ల హస్తం హవా 
  •     లెఫ్ట్​ మద్దతుతో మరింత బలం
  •     డీలా పడిన బీఆర్​ఎస్ ​నేతలు  
  •     బీజేపీ ప్రభావం అంతంతే!

మహబూబాబాద్, వెలుగు : మానుకోటలో కాంగ్రెస్​ జెండా ఎగరేస్తుందన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. లోక్​సభ టికెట్ దక్కితే చాలు  గెలుపు ఖాయమన్న అభిప్రాయం ఉంది. దీంతో  ఆ పార్టీ  టికెట్​ కోసం ఏకంగా 48 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్​ లోక్​సభ పరిధిలోని 7  సెగ్మెంట్లలో  ఆరు చోట్ల  కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచింది.   కేవలం భద్రాచలంలో మాత్రమే  స్వల్ప ఓట్ల తేడాతో  బీఆర్​ఎస్ ​అభ్యర్థి గెలిచారు.  ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి ​  బీఆర్ఎస్​ కన్నా కాంగ్రెస్​కు  2,93,445ఓట్లు ఎక్కువ వచ్చాయి.  దీంతో కాంగ్రెస్​ టికెట్​ కోసం ఆశావహులు ఢిల్లీ, హైదరాబాద్​కు చక్కర్లు కొడుతున్నారు. 

ఒకసారి కాంగ్రెస్​, రెండుసార్లు బీఆర్​ఎస్​ 

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహబూబాబాద్​  పార్లమెంట్​ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో  కాంగ్రెస్ ​నుంచి  పోరిక బలరాం నాయక్​ గెలిచారు. తొలిసారి గెలిచిన ఆయన అప్పట్లో  కేంద్ర సామాజిక శాఖ  మంత్రిగా  పనిచేశారు. 2014, 2019 ఎన్నికల్లో  బీఆర్ఎస్​అభ్యర్థులు గెలిచారు.  2014లో  ప్రొఫెసర్​ అజ్మీరా సీతారాంనాయక్​, 2019లో మాలోత్​ కవిత  కాంగ్రెస్​ అభ్యర్థి   బలరాం నాయక్​పై గెలుపొందారు. 

కాంగ్రెస్​లో ఆశావహుల జోరు 

ప్రస్తుతం మాహబూబాబాద్​ టికెట్​ కోసం  కాంగ్రెస్​లో తీవ్ర పోటీ నెలకొంది. రెండుసార్లు ఓడిపోయిన  కేంద్ర మాజీ మంత్రి  బలరాం నాయక్ ​తిరిగి టికెట్​ ఆశిస్తున్నారు. తనకు  హైకమాండ్​ ఆశీస్సులున్నాయని చెప్పుకుంటున్నారు.  బలరాంనాయక్​ రెండుసార్లు ఓడిపోయినా  పార్టీలో కొనసాగుతూ అధిష్ఠానానికి  విధేయుడిగా ఉన్నారు. ఢిల్లీ, రాష్ట్ర నేతలతో సత్ససంబంధాలున్న ఆయన​ ఇప్పటికే పార్లమెంట్​ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. హైకమాండ్​ నుంచి సానుకూల సంకేతాలుండడంవల్లే క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారని  ఆయన సన్నిహితులు చెప్తున్నారు.  

డోర్నకల్​ అసెంబ్లీ టికెట్​ఆశించి భంగపడ్డ  మాలోతు నెహ్రు నాయక్ సైతం ఎంపీ టికెట్​ కోసం​పోటీ పడగా ఆయనను  స్టేట్​ ఫైనాన్స్ కమిషన్​ మెంబర్​గా నియమించారు.  కొత్తగూడెంకు చెందిన శంకర్​నాయక్​ , ఆదివాసీ జాతీయ కాంగ్రెస్​ వైస్​ చైర్మన్​ తేజావత్​ బెల్లయ్య నాయక్​,  మంత్రి పొంగులేటి ఫాలోవర్​ విజయబాయి, ​​ రిటైర్డ్​ఎక్సైజ్ ఆఫీసర్​ బానోతు మోహన్​లాల్,​​ టీపీసీసీ సభ్యులు డాక్టర్​లకావత్​ లక్ష్మీనారాయణ, కిసాన్​ పరివార్​ నిర్వాహకుడు భూపాల్​ నాయక్, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్​ భట్టు రమేశ్ టికెట్​ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో లెఫ్ట్​పార్టీలకు కూడా చెప్పుకోదగ్గ బలం ఉంది. మహబూబాబాద్​, భద్రాచలం, కొత్తగూడెం సెగ్మెంట్లలో  వామపక్షాలకు ఓటుబ్యాంకు ఉంటుంది. జాతీయ స్థాయిలో లెఫ్ట్​ పార్టీలు ఇండియా కూటమిలో ఉండడంతో  కాంగ్రెస్​కు కలిసివచ్చే అవకాశముంది.

బీజేపీ ప్రభావం అంతంతే.. 

మహబూబాబాద్​లో బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించడంలేదు.  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు.  లోక్​సభ ఎన్నికల్లో జాతీయ అంశాలే కీలకంగా ఉంటాయని,  మానుకోటలోనూ మంచి ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక్కడ నుంచి బీజేపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్ నాయక్, మెడికల్​ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రవీంద్ర నాయక్, సుంచు రామకృష్ణ, స్వరూప, భూక్య సంగీత,  విజయలక్ష్మి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

బీఆర్ఎస్​లో కనిపించని జోష్​ 

బీఆర్​ఎస్​ నుంచి తిరిగి తానే పోటీ చేస్తానని సిట్టింగ్​ ఎంపీ మాలోత్​ కవిత ప్రకటించారు. మాజీ ఎంపీ ప్రొఫెసర్​ అజ్మీరా సీతారాంనాయక్ కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు చాలామంది బీఆర్ఎస్​ నేతలు ముందుకు రాగా, ఈసారి ఆ పరిస్థితి కనిపించడంలేదు. అసెంబ్లీ ఫలితాలతో  బీఆర్​ఎస్​లో జోష్​ తగ్గింది. కిందిస్థాయి నేతలు కూడా పూర్తిగా డీలా పడ్డారు. మహబూబాబాద్​, డోర్నకల్​ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటమికి దారితీసిన కారణాలపై  సమీక్ష కూడా జరగలేదు.