ఆపరేషన్ చేస్తుండగా పేషెంట్ మృతి.. జగిత్యాల జిల్లా ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

ఆపరేషన్ చేస్తుండగా పేషెంట్ మృతి.. జగిత్యాల జిల్లా  ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

జగిత్యాల రూరల్, వెలుగు : ఆపరేషన్ చేస్తుండ గా పేషెంట్ మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.  కుటుంబసభ్యులు, బంధువులు తెలిపిన ప్రకారం.. సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన అయిత గంగాధర్, రాజవ్వ(42) దంపతులకు పిల్లలు కలగకపోవడంతో చికిత్స కోసం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పల్లవి నర్సింగ్ హోమ్ ను సంప్రదించారు. 

డాక్టర్ పద్మిని టెస్టులు చేసి రాజవ్వ గర్భసంచికి గడ్డ ఉందని, తొలగించడానికి ఆపరేషన్ చేయాలని సూచించారు. గురువారం ఆపరేషన్ చేస్తుండగానే రాజవ్వ చనిపోయింది. కాగా.. హైదరాబాద్ లోని మరో డాక్టర్ వీడియో కాల్ ద్వారా సూచనలు చేస్తుండగా..  ఇక్కడ డాక్టర్ ఆపరేషన్ చేయడం వల్లనే  రాజవ్వ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 

ఘటనపై డాక్టర్ ను వివరణ కోరగా.. రాజవ్వకు ముందుగా మత్తు ఇంజక్షన్ ఇచ్చామని, ఆపరేషన్ మొదలుపెట్టగానే  గుండెపోటుతో చనిపోయిందని తమ తప్పిదం ఏమీ లేదని తెలిపారు. వీడియో కాల్ ద్వారా ఆపరేషన్ చేయలేదని చెప్పారు.  ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి మృతురాలి బంధువులకు నచ్చజెప్పి.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.