
బెంగళూరు: పట్నా పైరేట్స్, దబాంగ్ ఢిల్లీ జట్లు ప్రొకబడ్డీ లీగ్ తాజా సీజన్ ఫైనల్ కు చేరాయి. ఈ రెండు జట్ల మధ్య తుదిపోరు శుక్రవారం జరగనుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఢిల్లీ 40-35తో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్పై గెలిచింది. మరో సెమీఫైనల్లో పట్నా 38-27తో యూపీ యోధా జట్టును చిత్తు చేసింది.
పైరేట్స్ ఆల్రౌండ్ షో: యూపీతో మ్యాచ్లో పట్నా పైరేట్స్ డిఫెండర్లు మహ్మద్ రెజా, సునీల్ హైఫైవ్తో దుమ్ము రేపారు. అలాగే రైడర్లు సచిన్ 7 పాయింట్లు, గుమాన్సింగ్ 8 పాయింట్లు సాధించి సత్తా చాటడంతో పట్నాకు ఎదురులేకుండా పోయింది. పుణెతో ఎలిమినేటర్ మ్యాచ్లో అదరగొట్టిన యూపీ రైడర్ పర్దీప్ నర్వాల్ మ్యాచ్ లో ప్రభావం చూపలేకపోయాడు. అతడు నాలుగు పాయింట్లే తేగలిగాడు. మరోవైపు సబ్స్టిట్యూట్ ఆటగాడు శ్రీకాంత్ జాదవ్ 10 పాయింట్లతో యోధా జట్టులో రాణించాడు. పట్నా రైడర్ల ధాటికి మ్యాచ్ 10వ నిమిషంలోనే యూపీ ఆలౌటైంది. ప్రత్యర్థి జోరును అడ్డుకోలేకపోయిన యోధా 17వ నిమిషంలోనే మరోసారి ఆలౌటై.. 14 పాయింట్లు వెనుకంజలో నిలిచింది. ప్రథమార్థం చివర్లో పర్దీప్ రెండు పాయింట్ల తీసుకువచ్చినా.. విరామానికి పైరేట్స్ 23-9తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. రెండో భాగంలోనూ నర్వాల్, సురేందర్ తడబాటుకు లోనవడంతో 11వ నిమిషంలో యూపీ మరోసారి ఆలౌటైంది. ఈ దశలో మహ్మద్ హైఫైతో మెరవడంతో పట్నాకు తిరుగులేకపోయింది. అయితే శ్రీకాంత్ పాయింట్లు రాబట్టడంతో.. మ్యాచ్ ముగియడానికి 5నిమిషాల ముందు ప్రత్యర్థి ఆధిక్యాన్ని యూపీ 12పాయింట్లకు తగ్గించింది. మ్యాచ్ మరో 3 నిమిషాల్లో ముగుస్తుందనగా ప్రత్యర్థిని పట్నా పైరేట్స్ ఇంకోసారి ఆలౌట్ చేసి విజేతగా నిలిచింది.
ఇవి కూడా చదవండి: