అరేబియాలో మన యుద్ధనౌకల గస్తీ

అరేబియాలో మన యుద్ధనౌకల గస్తీ

 న్యూఢిల్లీ: సముద్రపు దొంగలు, డ్రోన్ దాడుల నుంచి వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించేందుకు నార్త్, సెంట్రల్ అరేబియా నుంచి ఏడెన్ గల్ఫ్ దాకా ఇండియన్ నేవీ 10 వార్​షిప్​లను మోహరించింది. యుద్ధ నౌకలపై మెరైన్ కమాండోలు విధులు నిర్వహిస్తారు. ఎంవీ కెమ్ ప్లూటోపై పైరేట్​ల దాడి నేపథ్యంలో నేవీ ఈ చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ ప్రాస్పిరిటీ గార్డియన్’ పేరుతో కూటమిని ఏర్పాటు చేసి అమెరికా కూడా పైరేట్ లపై పోరాడుతోంది. అయితే, ఈ కూటమిలో ఇండియా చేరలేదు. కీలకమైన ప్రాంతాల్లో ఇండియన్ నేవీ గస్తీ ముమ్మరం చేసింది. ఎలాంటి డ్రోన్ దాడులైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండియన్ నేవీ ప్రకటించింది. ఐఎన్ఎస్ కోల్​కతా, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ మోర్ముగావ్, ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ తార్కాష్ లాంటి వార్ షిప్​లను మోహరించినట్టు తెలిపింది. ఎకనామిక్ జోన్​లో నేవీ, కోస్ట్ గార్డ్ నిఘా నిరంతరం ఉంటున్నదని వివరించింది. యుద్ధ నౌకల మోహరింపుతో ఎలాంటి డ్రోన్, సముద్రపు దొంగల దాడులు ఉండవని ధీమా వ్యక్తం చేసింది.