- రేపటి నుంచి 31 వరకు టూర్లు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 28 నుంచి 31 వరకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యటించనున్నారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడాన్ని, ఈ పథకాన్ని నాశనం చేసే కేంద్రం కుట్రలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు నేతలు జిల్లాల టూర్లకు సిద్ధమయ్యారు. ఒక్కో జిల్లాలో ఉదయం ఒక నియోజవర్గంలోని గ్రామ సభలో, సాయంత్రం మరో నియోజకవర్గంలోని గ్రామ సభలో లీడర్లు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో నేతలు భోజనం చేస్తూ.. వారికి ఈ పథకం గురించి వివరించనున్నారు. ఈ నెల 28న మెదక్, మానకొండూర్ నియోజకవర్గాల్లో, 29 న వేములవాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో, 30న ఉదయం మేడారం సమక్క, సారలమ్మ దర్శనం, సాయంత్రం ఆలేరు నియోజకవర్గంలో, 31న నకిరేకల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లోని గ్రామ సభల్లో మీనాక్షి, మహేశ్ గౌడ్ పాల్గొననున్నారు.
