రైతుల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఈ విషయంలో రైతుల తరపున ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళను .. సీఎం తాలు గాళ్ళు అని మాట్లాడుతున్నాడన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా ఇళ్లందకుంటలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని… ప్రస్తుతం ఎన్నికలు కూడా లేవన్నారు. వరి , మొక్కజొన్న అమ్ముకున్న రైతులకు ఇంకా డబ్బులు రాలేదన్నారు. ప్రభుత్వ మద్దతు ధర అందరికి కల్పించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. తాలు పేరుతో దాదాపు 40 కిలోల సంచి మీద నాలుగు కిలోల తరుగు తీస్తున్నారని దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చాలా చోట్ల 20 రోజులు అయినా ధాన్యం కొనుగోలు చేయలేదని, గన్నీ సంచీల కొరత చాలా సెంటర్లలో ఉందని అన్నారు ఉత్తమ్. నెల రోజులు దాటినా ఇంకా 25 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని చెప్పారు . ఐకేపీ సెంటర్ల నిర్వాహకులకు మూడేళ్లుగా క్వింటాలుకు 35 రూపాయల కమిషన్ చెల్లించలేదని ఆయన అన్నారు.