- ప్రపోజల్స్కే పరిమితమైన రోడ్డు
- పెద్దకల్వల నుంచి అప్పన్నపేట వరకు నిర్మించాలని నిర్ణయం
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఆనుకొని బైపాస్రోడ్డు నిర్మాణం భూ సర్వేలకే పరిమితమైంది. ఈ సర్వే కూడా పూర్తయి రెండేండ్లు కావొస్తుండగా.. ఇంకా పనులు ప్రారంభం కాలేదు. పెద్దపల్లి జిల్లాకేంద్రం సమీపంలోని పెద్దకల్వల గ్రామం నుంచి అప్పన్నపేట వరకు బైపాస్ నిర్మించాలని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించారు.
బైపాస్ పూర్తయితే జిల్లాకేంద్రంలో తగ్గనున్న ట్రాఫిక్
కానీ డీపీఆర్ తయారుచేయకపోగా.. పదేండ్లు కాలయాపన చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు బైపాస్ నిర్మాణం చేస్తామని ప్రకటించారు. అనంతరం అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. అధికారులు సర్వే కూడా పూర్తి చేశారు. దీంతో బైపాస్ సాకారం అవుతుందని పెద్దపల్లి పట్టణవాసులు భావించగా.. ఇప్పటికీ ఎలాంటి కదలిక లేదు.
ట్రాఫిక్ సమస్యకు బైపాస్తో చెక్
పెద్దపల్లిలో ట్రాఫిక్ సమస్య పెరుగుతుండడంతో బైపాస్ రోడ్డు నిర్మించాలని ఎంతోకాలంగా డిమాండ్ ఉంది. జిల్లాకేంద్రంగా మారాక ట్రాఫిక్ సమస్య పెరగడంతో కచ్చితంగా బైపాస్ నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాజీవ్ రహదారి జాతీయ రహదారులతో లింక్ కావడంతో టౌన్ మధ్య నుంచే హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి. దీంతో ప్రతీ రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ట్రాఫిక్ సమస్యతోపాటు, రోడ్డు ప్రమాదాల నివారణకు గతంలోనే బైపాస్తోపాటు రింగ్ రోడ్డు లేదా టౌన్మధ్య నుంచే ఫ్లైఓవర్ నిర్మించాలనే గతంలోనే నిర్ణయించారు. ఈక్రమంలో పెద్దకల్వల నుంచి చందపల్లి మీదుగా అప్పన్నపేట వద్ద రాజీవ్ రహదారికి లింక్ అయ్యేలా నిర్మించాలని ప్లాన్ చేశారు. అలాగే పెద్దకల్వల కుడి వైపు నుంచి హన్మంతునిపేట మీదుగా అప్పన్నపేట ఫ్లైఓవర్కు లింక్ అయ్యేలా మరో ప్లాన్ కూడా చేశారు. కానీ ఆ రెండు ప్లాన్లు మూలనపడ్డాయి.
జిల్లా కేంద్రం అభివృద్ధికి చాన్స్
బైపాస్ నిర్మాణం పూర్తయితే పెద్దపల్లి జిల్లా కేంద్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది. పెద్దపల్లి పట్టణం.. పెద్ద కల్వల నుంచి అప్పన్నపేట వరకు రెండు వైపులా 500 మీటర్ల వెడల్పుతోనే ఎక్కువగా విస్తరించి ఉంది. జిల్లా కేంద్రం ఏర్పాటైన నాటి నుంచి పట్టణం మధ్య నుంచి పోతున్న రాజీవ్ రహదారిని ఆనుకొని మాత్రమే నిర్మాణాలు జరగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది.
బైపాస్ నిర్మాణం జరిగితే పెద్దపల్లి పట్టణం రెండు వైపులా పెరిగే చాన్స్ ఉంది. బైపాస్ నిర్మాణం చందపల్లి వైపు నుంచి జరిగితే నిట్టూరు, నిమ్మనపల్లితో పాటు తుర్కలమద్దికుంట వరకు సిటీ పెరిగే చాన్స్ ఉంటుంది. ఒకవేళ చీకురాయి, హన్మంతునిపేట, గౌరెడ్డిపేట మీదుగా బైపాస్వెళ్తే అభివృద్ధికి ఆస్కారం ఉంది. ఇప్పటికే హన్మంతునిపేట వైపు కునారం రోడ్డులో ఆర్వోబీ నిర్మిస్తున్నారు. మంథని రోడ్డులోనూ ఇప్పటికే ఫ్లై ఓవర్ ఉంది.. కానీ వాహనాల రద్దీకి సరిపోవడం లేదు. ఈ క్రమంలో బైపాస్ నిర్మిస్తే ప్రయోజనం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
