న్యూఢిల్లీ : గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అక్టోబర్ లో యాపిల్ కంపెనీ నుంచి హ్యాకింగ్ అలర్ట్ లు వచ్చిన అనంతరం ఇద్దరు భారతీయ జర్నలిస్టుల ఫోన్లలో తాము పెగాసస్ స్పైవేర్ ను గుర్తించినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. పెగాసస్ స్పైవేర్తో భారత ప్రభుత్వం మళ్లీ హై-ప్రొఫైల్ జర్నలిస్టులను టార్గెట్ చేసిందని చెప్పింది. ఇందులో "ది వైర్" పత్రిక ఎడిటర్ సిద్ధార్థ వరదరాజ్, ది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ హెడ్ ఆనంద్ మంగ్నాలే ఫోన్లను తమ సెక్యూరిటీ ల్యాబ్ పరీక్షించగా.. వాటిలో పెగాసస్ ఉన్నట్లు తేలిందని ఆమ్నెస్టీ వెల్లడించింది.
గత అక్టోబర్ లో పలువురు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులకు యాపిల్ సంస్థ నుంచి హ్యాకింగ్ అలర్ట్ లు వచ్చాయి. ప్రభుత్వ మద్దతుతో జరిగే హ్యాకింగ్ కు వీరి ఫోన్లు లక్ష్యంగా మారినట్లు సందేశాలు వచ్చాయి. ఆ తర్వాత దీనిపై వివరణ ఇచ్చిన యాపిల్.. 150 దేశాలకు ఇలాంటి సందేశాలు వెళ్లాయని చెప్పింది. హ్యాకింగ్ సందేశాలు వచ్చిన అనంతరం ఇద్దరు జర్నలిస్టులు తమ ఫోన్లను అమ్నెస్టీ ల్యాబ్ కు పంపించగా, స్పైవేర్ ఉన్నట్టు ఆ ల్యాబ్ కన్ఫమ్ చేసింది. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు రాజకీయ నాయకులకు చెందిన వెయ్యి ఫోన్లను పెగాసస్ తో హ్యాక్ చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.