న్యూఢిల్లీ: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచాయి. దీంతో రవాణా, లాజిస్టిక్ సెక్టార్లు ఎక్కువగా నష్టపోతాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా ఏవియేషన్, సిమెంట్, పెయింట్స్ వంటి సెక్టార్లపై కూడా ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు.
ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 0.42 శాతం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ‘‘పెట్రోల్,డీజిల్ ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 0.15–0.25 శాతం పెరుగుతుంది. పాల ధరలు పెరగడం వలన మరో 0.26 శాతం పెరుగుతుంది” అని వివరించారు.
1. లాజిస్టిక్స్, డెలివరీ కంపెనీలు
రవాణాపై పూర్తిగా ఆధారపడే కంపెనీల ఖర్చులు వెంటనే పెరగనున్నాయి. వీఆర్ఎల్ లాజిస్టిక్స్, బ్లూ డార్ట్ , డెలివరీ కంపెనీల ఆపరేటింగ్ కాస్ట్ ఎక్కువవుతుంది. జొమాటో, స్విగ్గీ వంటి వంటి కంపెనీల పార్టనర్ల ఇంధన ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల డెలివరీ ఛార్జీలు పెంచాల్సి రావచ్చు లేదా కంపెనీలే ఆ భారాన్ని భరించాల్సి వస్తుంది.
2. ఏవియేషన్ సెక్టార్
ఇంధన ధరల పెంపు నేరుగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై ప్రభావం చూపుతుంది. ఇండిగో, స్పైస్జెట్ వంటి ఎయిర్లైన్స్ కంపెనీల మొత్తం నిర్వహణ ఖర్చులలో దాదాపు 40శాతం కేవలం ఇంధనానికే అవుతుంది.
3. ప్యాసింజర్ రవాణా, క్యాబ్ అగ్రిగేటర్లు
ఉబెర్ , ర్యాపిడో, ఓలా డ్రైవర్ల రోజువారీ సంపాదన తగ్గుతుంది. డ్రైవర్లను నిలబెట్టుకోవడానికి ఈ కంపెనీలు రైడ్ ఛార్జీలను పెంచాల్సి వస్తుంది. ఇది బుకింగ్స్ తగ్గడానికి దారితీయొచ్చు.
4. డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు జూమ్
సిమెంట్ పరిశ్రమలో ముడిసరుకు తరలింపునకు, డిస్ట్రిబ్యూషన్కు రవాణా అత్యంత కీలకం. ఆల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్స్, శ్రీ సిమెంట్ వంటి కంపెనీల రవాణా ఖర్చులు పెరగడం వల్ల వీటి ఇన్పుట్ కాస్ట్ ఎక్కువవుతుంది. మరోవైపు పెయింట్స్, టైర్ల తయారీ కంపెనీలు తమ స్టాక్ను డీలర్లకు చేరవేయడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఎంసీజీ కంపెనీలు కూడా తమ ప్రొడక్ట్లను గ్రామాలకు చేరవేయడానికి ఎక్కువ ఖర్చు చేయాలి.
