జగిత్యాల కాంగ్రెస్‌లో సర్వేల కలవరం..

జగిత్యాల కాంగ్రెస్‌లో సర్వేల కలవరం..
  • వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభర్థిత్వంపై కన్‌ఫ్యూజన్​ క్రియేట్​చేస్తున్న ఫోన్​కాల్స్​
  • కాంగ్రెస్‌లో జీవన్‌రెడ్డికి ప్రత్యామ్నాయం ఎవరంటూ సర్వే 
  •  జగిత్యాలలో బరిలో కొత్త లీడర్లు దిగుతారంటూ ప్రచారం అయోమయంలో కేడర్

జగిత్యాల, వెలుగు: జగిత్యాల కాంగ్రెస్‌లో ఫోన్​కాల్స్​ సర్వేలు కలకరం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటుందంటూ వస్తున్న ఫోన్​కాల్స్ కేడర్‌‌తోపాటు, జనంలోనూ కన్‌ఫ్యూజన్ ​క్రియేట్​చేస్తున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జీవన్​రెడ్డి జగిత్యాలలో కాంగ్రెస్‌కి  కేరాఫ్‌గా ఉన్నారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండగా, ఆయన తర్వాత ఎవరనే దానిపై జిల్లాలో చర్చ నడుస్తోంది. ఆయన ఇప్పటికే ఆరు సార్లు గెలిచి నియోజకవర్గంతోపాటు జిల్లాలోనూ పట్టు సంపాదించారు. మరో మూణ్నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జగిత్యాల అభ్యర్థి ఎవరైతే గెలుస్తారంటూ సర్వే జరగడం జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ ఫోన్​కాల్స్​లో కాంగ్రెస్ ​జిల్లా మహిళా అధ్యక్షురాలు, మాజీ మున్సిపల్​చైర్‌‌పర్సన్ విజయలక్ష్మి పేరు ప్రస్తావనకు వస్తోంది. కాగా ఈ ఫోన్​కాల్స్​ఎవరు చేయిస్తున్నారనేది జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. 

జీవన్‌రెడ్డి తర్వాత ఎవరనేదానిపై చర్చ

మూడు దశాబ్దాలుగా జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెంటర్‌‌గానే కాంగ్రెస్​రాజకీయాలు నడిచాయి. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయనదే కీలకపాత్ర. ఇప్పటివరకు ఆయన ఎమ్మెల్యేగా 9 సార్లు బరిలో నిలిచి 6 సార్లు గెలవగా, మరో రెండు సార్లు ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ప్రజానాడి తెలిసిన వ్యక్తిగా పేరున్న జీవన్ రెడ్డి తన స్థానాన్ని భర్తీ చేయగలిగే మరో లీడర్‌‌ను తీసుకురావడం లో వెనుకబడ్డారని కాంగ్రెస్ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తన తర్వాత ఎవరు బరిలో ఉండాలనేదానిపై ఆయనకు స్పష్టత లేకపోవడం, వారసుడి ఎంపికలో ఆలస్యం చేశారన్న చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డి అనుచరుల్లో కొందరు సీనియర్​ లీడర్లు ఉండగా, కుటుంబసభ్యులు కూడా ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు వెయిట్​ చేస్తున్నారు. 

జీవన్ రెడ్డి మరదలు, మున్సిపల్​మాజీ చైర్‌‌పర్సన్​ విజయలక్ష్మి ఇటీవల కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలిగా అవకాశం దక్కించుకోగా, మరో మరదలు తాటిపర్తి శోభరాణి అనుచరులు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. మరోవైపు జీవన్‌రెడ్డి కొడుకు రామచంద్రారెడ్డి కూడా తండ్రి తర్వాత బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న జీవన్ రెడ్డికి ఇంటి పోరు ఇబ్బందికరంగా మారిందని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తన తర్వాత ఎవరనేదానిని ప్రకటించకుండా కొద్ది రోజులు వాయిదా వేయాలని జీవన్‌రెడ్డికి ఆయన సన్నిహితులు సూచిస్తున్నట్లు సమాచారం. 

ALSO READ :వడ్ల గోడౌన్‌‌గా.. బత్తాయి మార్కెట్

సర్వేతో ప్రకంపనలు 

2014 లో ఇవే తనకు చివరి ఎన్నికలని జీవన్ రెడ్డి అప్పట్లోనే ప్రకటించారు. అయితే  ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో జగిత్యాలలో ఆయనే బరిలో నిలిచారు. ఆ టైంలో ఆయనను రీప్లేస్​ చేసే లీడర్​లేకపోవడమే ఇందుకు కారణమన్న వాదనలున్నాయి. కాగా ప్రస్తుతం ఆయన వారసుడిగా తన పెద్ద కొడుకు తాటిపర్తి రాంచంద్రారెడ్డిని తీసుకువస్తారా..? లేక  మరదలు, మున్సిపల్​మాజీ చైర్‌‌పర్సన్​విజయలక్ష్మికి అవకాశం ఇస్తారా..? అన్న ప్రశ్నలు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాలను ఫోన్ కాల్ సర్వేలు మరింత అయోమయంలో పడేస్తున్నాయి. అసలు ఈ ఫోన్ కాల్ సర్వేలు ఎవరూ చేయిస్తున్నారనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. అభ్యర్థి మార్పు కోసం కాంగ్రెస్ హై కమాండ్ చేయిస్తుందా..? లేక జగిత్యాలలో బరిలోకి దిగాలని భావిస్తున్న విజయలక్ష్మి వర్గీయులు చేయిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈసారి కూడా జీవన్ రెడ్డి బరిలో ఉంటేనే గెలుపు అవకాశాలు ఉంటాయని ఆయన సన్నిహితులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.