భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీస్ కస్టడీ

భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీస్ కస్టడీ

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులైన అడిషనలల్ ఎస్పీలను చంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 2024 ఏప్రిల్ 2 వరకూ వీరిద్దరినీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరపనున్నారు. ఇందులో భాగంగా ఉస్మానియాలో వారికి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం బంజార హిల్స్ పోలీస్ స్టేషన్ బయలుదేరారు. ఐదు రోజులపాటు న్యాయవాది సమక్షంలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలను విచారించనుంది దర్యాప్తు బృందం. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే డీఎస్పీ ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న అరెస్ట్ కాగా, వీరిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ ను, ఎస్ఐబీలో ఇన్ స్పెక్టర్ గా పనిచేసిన గట్టుమల్లును గురువారం(మార్చి 28) అరెస్ట్ చేశారు. పోలీస్ కస్టడీలో భుజంగరావు, తిరుపతన్నలను విచారించేటప్పుడు ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే భుజంగరావు తిరుపతన్నకు సంబంధించిన ఆధారాలను సేకరించారు పోలీసులు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా భుజంగరావు, తిరుపతన్న స్టేట్మెంట్ కీలకంగా ఉండనుందని.. వీరు ఇచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఉన్నతాధికారులతోపాటు రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అనే కోనంలో భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. కస్టడీ ముగిసిన తర్వాత నిందితులతోపాటు దీనికి సంబంధించిన రికార్డులను కూడా కోర్టుకు అప్పగించవలసి ఉంటుంది.