
దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారు.. యాదగిరిగుట్ట పాపాలే ఇప్పుడు కేసీఆర్ కు తగులుతున్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని.. దీంతో మైండ్ బ్లాంక్ అయ్యి ఏదేదో మాట్లాడుతున్నాడంటూ చురకలు అంటించారు మంత్రి. పార్టీ టికెట్ ఇస్తున్నా.. పోటీ చేయం అంటూ వెళ్లిపోతున్నారని.. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరుచుడు కాదు.. మా గేట్లు పగలగొట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. 2024, మార్చి 29వ తేదీ ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగలరు అని.. కేసీఆర్ ఆయన కొడుకు మాత్రమే ఉంటారని స్పష్టం చేశారాయన.
ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రాష్ట్రంలో చూడలేదని.. దుర్మార్గంగా కేసీఆర్ వ్యవహరించారంటూ మండిపడ్డారాయన. ఫోన్ ట్యాపింగ్ నిందితులు ఎవర్నీ వదిలేది లేదని హెచ్చరించారు. ఎంపీ టికెట్ల కేటాయింపు విషయంలో జోక్యం చేసుకోవటం లేదని.. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానంటూ వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
రైతు బంధు నిధులు 97 శాతం మంది రైతులకు పడ్డాయని..అర్హులైన అందరికీ ఇచ్చినట్లు వెల్లడించారాయన. యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చటం, యాదగిరిగుట్ట పేరుతో చేసిన పాపాలే ఇప్పుడు కేసీఆర్ కు శాపాలు అయ్యాయన్నారు. దళితబంధు, సీఎంఆర్ఎఫ్ పథకాల్లో కమీషన్లు తీసుకున్నారని..అన్నింటిపై విచారణ జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ ఇండ్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.