
కోల్కతా: హాస్పిటల్స్లో మొబైల్ ఫోన్లు వాడటంపై బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. కోల్కతాలోని బాంగూర్ హాస్పిటల్లో కరోనా పేషంట్లు ఉన్న ఐసోలేషన్ వార్డులో ఇద్దరు వ్యక్తలు చనిపోయారు. అయితే కొన్ని గంటల పాటు వారి శవాలను అక్కడే వదిలేశారు. దీంతో దాన్నంతా వీడియో తీసిన తోటి పేషంట్లు సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో వైరల్ అయింది. గంటల కొద్ది డెడ్బాడీలను అక్కడే వదిలేశారని, తీసేయమని ఎంత చెప్పినా వైద్య సిబ్బంది పట్టించుకోలేదని పేషంట్లు ఆరోపించారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదని అన్నారు. దీంతో వీడియోలు బయటకు రాకుండా మొబైల్ ఫోన్స్ నిషేధించారు. ఈ మేరకు పేషంట్లకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ల్యాండ్ ఫోన్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవా సిన్హా ప్రకటించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో దీదీపై ఫైర్ అయ్యారు. పేషంట్లకు కనీస వసతులు కల్పించడం లేదని ఆరోపణలు చేశారు. వీడియో చూసి షాక్ అయ్యాయని అన్నారు. “ ఈ వీడియో ఇంత వైరల్ అయినప్పటికీ కనీస సర్కార్ స్పందించడం లేదు. అది ఫేక్ అని చెప్పేందుకు కూడా దీదీ బయటకు రావడం లేదు. దీంతో నిజమనే నమ్మాల్సి వస్తుంది” అని బాబుల్ సుప్రియో ట్వీట్ చేశారు.