గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్లేవారికి తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్లేవారికి తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
  • ఉదయం, సాయంత్రం వేళల్లో కిలోమీటర్ ప్రయాణానికి అరంగట 
  • ఫ్లై ఓవర్​ ప్రారంభమయ్యాక 1.2 కిలోమీటర్లకు 2.25 నిమిషాలే 
  • ఏడాదికి రూ.11 కోట్ల ఇంధనం ఆదా
  • హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు

హైదరాబాద్ సిటీ, వెలుగు : శిల్పా లేఅవుట్ ఫేజ్--2(పీజేఆర్) ఫ్లై ఓవర్ ప్రారంభంతో గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మొత్తం 4.4 కిలోమీటర్లు ఉంటే ఈ రూట్​లో ఓఆర్ఆర్​ఎగ్జిట్​నుంచి కొత్తగూడ జంక్షన్​వరకు ఉదయం, సాయంత్రం కిలోమీటర్ ప్రయాణించాలంటే దాదాపు అరగంటకు పైగానే పడుతుంది. మధ్యాహ్నం వేళలో 15 నిమిషాలకు తక్కువ పట్టడం లేదు. దీనివల్ల ఇంధన భారంతోపాటు వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి చుక్కలు చూస్తున్నారు. అయితే, ఫ్లై ఓవర్ ప్రారంభంతో ఈ కష్టాలకు చెక్​పడనున్నది.

ఈ ఫ్లైఓవర్ పై నుంచి 1.2 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 నిమిషాల 25 సెకన్లలో చేరుకోవచ్చు. కొత్తగూడ సమీపంలో ముగిసే ఈ ఫ్లై ఓవర్​నుంచి కొండాపూర్​వరకు ట్రాఫిక్​తిప్పలు లేకుండా చేరుకోవచ్చు. నగరంలో ఏడో అతిపెద్ద ఫ్లైఓవర్ గా గుర్తింపు పొందగా, ఈనెల 28న సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ రూట్ లో వెళ్లే వారి కోసం ఎస్ఆర్డీపీ కింద నిర్మించిన ఈ ఫ్లై ఓవర్​ప్రారంభోత్సవానికి సిద్ధం కావడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఏడాదికి రూ.11 కోట్లు ఆదా..

పీజేఆర్​ ఫ్లైఓవర్ ప్రారంభమయ్యాక కొండాపూర్, శిల్పా లేఅవుట్ ప్రాంతాల్లో వాహనాల వేగం పుంజుకుంటుందని అధికారులంటున్నారు. గచ్చిబౌలి జంక్షన్ నుంచి నేరుగా ఈ ఫ్లైఓవర్ పైకి ఎక్కి సాగిపోవచ్చని, దీనివల్ల గచ్చిబౌలి జంక్షన్ వద్ద కూడా ట్రాఫిక్ జామ్ తగ్గుతుందంటున్నారు. 

 గచ్చిబౌలి ఔటర్ నుంచి కొండాపూర్ రోడ్డు రూట్​లో రోజూ 50 నుంచి 60 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, ట్రాఫిక్ జామ్ కారణంగా రోజూ సుమారు 3007 లీటర్ల వరకు ఇంధనం వృథా పోతోందంటున్నారు. ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే  నెలకు దాదాపు రూ.90 లక్షలు, ఏటా రూ. 11 కోట్ల వరకు ఇంధనం ఖర్చు ఆదా అవుతుందంటున్నారు. 

అతిపెద్ద ఫ్లైఓవర్లలో స్థానం.. 

పీజేఆర్ ఫ్లైఓవర్ నగరంలోని అతిపెద్ద ఫ్లైఓవర్లలో ఒకటిగా స్థానాన్ని దక్కించుకోనుంది. సిటీలో పీవీ నరసింహారావు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ వే నాలుగు లేన్లతో11.66 కి.మీ తో మొదటి స్థానంలో నిలవగా, ఆరాంఘర్ ఫ్లైఓవర్ ఆరులేన్లతో 4.08 కి.మీ తో రెండో స్థానంలో ఉంది. కొత్తగూడ ఫ్లైఓవర్ నాలుగులేన్లతో 3 కి.మీ(మూడో స్థానం) , షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేట ఫ్లైఓవర్ ఆరులేన్లతో  2.71 కి.మీ(నాలుగో స్థానం) , శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ఫేజ్–1 నాలుగు లేన్లతో 1.75 కి.మీ (ఐదోస్థానం)  ఉండగా, ఓవైసీ- మిథాని ఫ్లైఓవర్ మూడు లేన్లతో 1.40 కి.మీ (ఆరో స్థానం) ఉంది. ఆ తర్వాత పీజేఆర్ ఫ్లైఓవర్ 1.20 కి.మీతో ఏడో స్థానంలో నిలిచింది. దీని తర్వాత ఆరు లేన్లతో బాలాన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ ఫ్లైఓవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ 1.13 కి.మీతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది.